ప్రజల్లో ఉన్నవారికే అవకాశం – అభ్యర్థుల ఎంపికపై మంత్రి వ్యాఖ్యలు
ప్రజల్లో ఉన్నవారికే అవకాశం – అభ్యర్థుల ఎంపికపై మంత్రి వ్యాఖ్యలు
Krishna
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మంలోని ఎస్.ఆర్. కన్వెన్షన్ హాల్లో జరిగిన ఏదులాపురం మున్సిపాలిటీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో ఉండి నిరంతరం సమస్యలపై పోరాడే నాయకులకే అభ్యర్థిత్వం దక్కుతుందని స్పష్టం చేశారు. కటౌట్లు పెట్టడం, హడావుడి చేయడం వల్ల టికెట్లు రావని, గెలుపు సామర్థ్యం ఉన్నవారికే బి-ఫామ్ ఇస్తామని తేల్చి చెప్పారు.ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కదలాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఉపాధి హామీ పథకం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రజలకు ఎలా మేలు చేస్తున్నాయో ఇంటింటికీ వివరించాలని అన్నారు.
ప్రతి వార్డులో పెండింగ్లో ఉన్న రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలను గుర్తించి అధికారులకు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నికల షెడ్యూల్కు ముందే వీలైనంత పనులు పూర్తిచేసేందుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఏదులాపురం మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రి తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి