Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 01:00 AM

ప్రజలే డబ్బులిచ్చి… సర్పంచ్‌ను గెలిపించారు మునిపంపుల తీర్పు: భావి తరాలకు ఆదర్శం

ప్రజలే డబ్బులిచ్చి… సర్పంచ్‌ను గెలిపించారు మునిపంపుల తీర్పు: భావి తరాలకు ఆదర్శం

ప్రజలే డబ్బులిచ్చి… సర్పంచ్‌ను గెలిపించారు మునిపంపుల తీర్పు: భావి తరాలకు ఆదర్శం
December 22, 2025 12:01 PM 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

మల్లం మహేష్, స్థానికం ప్రతినిధి.

ప్రలోభాలకు చెక్… ప్రజాస్వామ్యానికి జై!

(యాదాద్రి భువనగిరి - రామన్నపేట):

ఎన్నికలు అంటే డబ్బు, మద్యం, ప్రలోభాలు తప్పవన్న భావన రాజకీయ వాస్తవంగా మారిన ఈ రోజుల్లో, యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామం ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి పోసింది.

సాధారణంగా ఎన్నికలంటే నాయకులు ఓటర్లకు డబ్బులు పంచడం చూస్తుంటాం. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. నోట్లు, మద్యం (చుక్క), మాంసాహారం (ముక్క), వెండి ఆభరణాల వంటి ప్రలోభాలకు ఆశపడకుండా.. ప్రజలే స్వయంగా చందాలు వేసుకుని, డబ్బులిచ్చి మరీ తమకు నచ్చిన నాయకుడిని గెలిపించుకున్నారు.

నిజాయితీ గెలిచింది:

మునిపంపుల సర్పంచ్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ బరిలో ఉన్నా, ప్రజలు మాత్రం డబ్బు రాజకీయాలను చీదరించుకున్నారు. ప్రజా సమస్యలు తెలిసిన, ప్రజల మధ్యే జీవించిన సీపీఐ(ఎం) పార్టీకి చెందిన యువ నాయకుడు బొడ్డుపల్లి వెంకటేశం వైపు మొగ్గు చూపారు.

ఎవరీ వెంకటేశం? సర్పంచ్‌గా ఎన్నికైన బొడ్డుపల్లి వెంకటేశం రాజకీయ వారసత్వం లేని సాధారణ యువకుడు. విద్యార్థి దశ నుంచి ప్రజా ఉద్యమాల వరకు ఆయన ప్రయాణం సాగింది. గ్రామంలోని త్రాగునీరు, ఉపాధి, రోడ్లు, విద్య, వైద్యం వంటి సమస్యలపై ఆయన చేసిన పోరాటాలే ఆయనకు శ్రీరామరక్షగా మారాయి.

ప్రచార బాధ్యత ప్రజలదే:

వెంకటేశం దగ్గర ఓటు కొనడానికి ఒక్క రూపాయి కూడా లేదు. దీంతో గ్రామ ప్రజలే ఆయన ప్రచార బృందంగా మారారు. ఇంటింటా చందాలు వసూలు చేసి ఎన్నికల ఖర్చును, ప్రచార వ్యయాన్ని భరించారు. "మా ఓటు అమ్ముకోం.. మా నాయకుడిని మేమే గెలిపించుకుంటాం" అని నిరూపిస్తూ, ఏకంగా 454 ఓట్ల మెజార్టీతో వెంకటేశంను గెలిపించారు.

రాజకీయాలకు చెంపపెట్టు: ఈ గెలుపు కేవలం వెంకటేశం విజయం మాత్రమే కాదు, డబ్బు రాజకీయాలకు ప్రజలు ఇచ్చిన గట్టి చెంపపెట్టు. రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఇలాంటి మార్పు రావాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మునిపంపుల గ్రామం చూపిన ఈ దారి, రేపటి రాజకీయాలకు దిశానిర్దేశం అనడంలో సందేహం లేదు.


డబ్బు కాదు—ప్రజలే అసలైన శక్తి అని ఈ గ్రామం నిరూపించింది. సర్పంచులు ప్రమాణస్వీకారం చేస్తున్న ఈ వేళ, మునిపంపుల ఆదర్శం రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News