ప్రజల సమస్యల పరిష్కారానికి ముందడుగు – ఖేడ్ ఎమ్మెల్యే సమీక్ష
ప్రజల సమస్యల పరిష్కారానికి ముందడుగు – ఖేడ్ ఎమ్మెల్యే సమీక్ష
Krishna
కంగ్టి మండల కేంద్రంలోని బసవ ప్రదీప్ కళ్యాణ మండపంలో నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ మరియు తాగునీటి సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కార మార్గాలను సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఎమ్మెల్యే స్వయంగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను వినడం మాత్రమే కాకుండా, సంబంధిత అధికారులను కూడా వెంట తీసుకెళ్లి అక్కడికక్కడే సమస్యలను నమోదు చేయించి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు, దీంతో ప్రజల్లో నమ్మకం పెరిగింది.వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశిస్తూ, లో-వోల్టేజ్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయాలని సూచించారు. రైతులకు సాగునీటి అవసరాలకు అనుగుణంగా సరిపడా విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులకు ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తాగునీరు సమృద్ధిగా అందేలా చూడాలని, పైపులైన్లలో లీకేజీలను వెంటనే అరికట్టి మరమ్మతులు చేయాలని, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు మెరుగైన సేవలు అందించడమేనని, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖకు చెందిన అధికారులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి