ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం — కలెక్టర్ ఆదేశాలు
ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం — కలెక్టర్ ఆదేశాలు
స్థానికం బృందం
ప్రజావాణి అర్జీలపై కలెక్టర్ సీరియస్ — పెండింగ్కు చోటు లేదు
యాదాద్రి స్థానికం ప్రతినిధి
ప్రజావాణిలో వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం కనిపించాల్సిందేనని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు ఫైళ్లలో మగ్గిపోవద్దని, సత్వర చర్యలతో ఫలితాలు కనిపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి మొత్తం 24 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి, స్టేట్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
వచ్చిన అర్జీల్లో రెవిన్యూ శాఖకు 16, జిల్లా పంచాయతీకి 3, విద్యా శాఖకు 2, మున్సిపాలిటీ, జిల్లా గ్రామీణాభివృద్ధి, ఎంప్లాయిమెంట్ శాఖలకు ఒక్కోటి చొప్పున వచ్చినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం మండల తహసీల్దార్లు, మండల స్పెషల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్షలో భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. భూభారతిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఆయా మాడ్యూల్స్లో క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం అర్హులైన వారికి ఆమోదం ఇవ్వాలన్నారు. తిరస్కరణ జరిగితే స్పష్టమైన కారణాలు భూభారతి మార్గదర్శకాలకు అనుగుణంగా నమోదు చేయాలని ఆదేశించారు. మండల స్పెషల్ ఆఫీసర్లు తమ మండలాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.
ఈ సందర్భంగా గురుకులాలు, వివిధ సొసైటీల రెసిడెన్షియల్ పాఠశాలల్లో బ్యాక్లాగ్, కొత్త అడ్మిషన్లకు సంబంధించిన అర్హత పరీక్ష పోస్టర్ను కలెక్టర్లు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, హౌసింగ్ పీడీ విజయసింగ్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి