ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేయాలి : ఎమ్మెల్యేలు
ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేయాలి : ఎమ్మెల్యేలు
Krishna
సంగారెడ్డి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, సాగునీరు, రహదారులు, రైతు సమస్యలు తదితర అంశాల పరిష్కారానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కలిసి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ను కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గంలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించేందుకు కొత్త బోర్వెల్స్ మంజూరు చేయాలని, ఎమ్మెల్యే కోట కింద 40 శాతం ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని ఎమ్మెల్యే మాణిక్రావు కోరారు. అలాగే జహీరాబాద్–గౌసాబాద్, బోనస్పూర్–తాండూర్, అల్గోల్, దిగ్వల్–సరసంఘం ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పూర్తయిన వేజ్–నాన్వేజ్ మార్కెట్ యార్డును ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని కూడా కోరారు.పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తన నియోజకవర్గంలో సాగునీటి సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి త్వరగా పరిష్కారం చూపించాలని కలెక్టర్ను కోరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ జొన్నల కొనుగోలు విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని, ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చినప్పటికీ ప్రభుత్వం కేవలం 10 క్వింటాళ్లనే కొనుగోలు చేస్తోందని తెలిపారు. కనీసం ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సంగారెడ్డి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు, రోడ్లు, తాగునీటి సమస్యలు, మౌలిక వసతుల అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, తట్టు నారాయణ, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, చింత సాయినాథ్, గోవర్ధన్ నాయక్, సర్పంచ్ హరివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి