ప్రభుత్వ బడి చదువు.. ర్యాంకుల వెలుగు!
ప్రభుత్వ బడి చదువు.. ర్యాంకుల వెలుగు!
K.RAVI
ఎంసెట్లో సత్తా చాటిన నేలపట్ల విద్యార్థిని 'బుట్టి వెన్నెల'
"ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఫలితాలు రావు" అనే అపోహను పటాపంచలు చేస్తూ, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ సామాన్య విద్యార్థిని రాష్ట్ర స్థాయి ర్యాంకుతో మెరిసింది.చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామానికి చెందిన బుట్టి వెన్నెల, ఇటీవల వెలువడిన తెలంగాణ ఎంసెట్ (EAPCET) ఫలితాల్లో 2184వ ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది.
ఒకటో తరగతి నుంచి సర్కారు బడిలోనే..వెన్నెల తన విద్యాభ్యాసాన్ని మొదటి నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే కొనసాగించింది.1 నుంచి 5వ తరగతి వరకు నేలపట్ల ప్రభుత్వ పాఠశాల. 6 నుంచి 10వ తరగతి వరకు రామన్నపేట మండలం జనంపల్లి గురుకుల పాఠశాల (10వ తరగతిలో 9.7 GPA సాధన). ఇంటర్మీడియట్ వరంగల్ జిల్లా హసన్పర్తి ప్రభుత్వ గురుకుల కళాశాల (MPC విభాగంలో 990 మార్కులు).
పైసా ఖర్చు లేకుండా.. ప్రైవేటుకు దీటుగా!
నేటి కాలంలో లక్షలాది రూపాయలు వెచ్చించి కార్పొరేట్ కళాశాలల్లో కోచింగ్ తీసుకుంటున్నా ఆశించిన ఫలితాలు రావడం కష్టమవుతోంది. ఇలాంటి తరుణంలో, ఎటువంటి ప్రైవేటు కోచింగ్ తీసుకోకుండా, కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో చదివి వెన్నెల ఈ ఘనత సాధించడం విశేషం.వెన్నెల విజయం పట్ల ఆమె తండ్రి బుట్టి శ్రీనివాసులు, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచేలా వెన్నెల సాధించిన ఈ విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో ఘనంగా సత్కరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి