పది రోజుల్లో 85% ఓటర్ మ్యాపింగ్ పూర్తి చేయాలి: కలెక్టర్ పి. ప్రావీణ్య
పది రోజుల్లో 85% ఓటర్ మ్యాపింగ్ పూర్తి చేయాలి: కలెక్టర్ పి. ప్రావీణ్య
Krishna
ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియను ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో సమర్థవంతంగా అమలు చేసి స్పష్టమైన పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా ఖచ్చితత్వం ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది అని పేర్కొంటూ, ఈ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని స్పష్టం చేశారు.బుధవారం కలెక్టరేట్ వీసీ హాల్లో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లతో ప్రి–ఎస్.ఐ.ఆర్ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రం వారీగా పురోగతిని పరిశీలించిన కలెక్టర్, పనితీరులో వెనుకబడి ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సంబంధిత ఏఈఆర్ఓలను కారణాలు అడిగి తెలుసుకుని, వెంటనే సరిదిద్దే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లాలో ఇప్పటివరకు 51.96 శాతం మాత్రమే ఓటర్ మ్యాపింగ్ పూర్తయిందని, ముఖ్యంగా అర్బన్ సెగ్మెంట్లో పురోగతి ఆశించిన స్థాయిలో లేదని తెలిపారు. డోర్ టు డోర్ సందర్శనలను మరింత వేగవంతం చేసి, వచ్చే పది రోజుల్లో కనీసం 85 శాతం పురోగతి సాధించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఈఆర్ఓలు నిరంతర పర్యవేక్షణ చేయాలని, క్షేత్రస్థాయిలో బృందాలకు మార్గనిర్దేశం చేయాలని స్పష్టం చేశారు.తక్కువ పురోగతి ఉన్న బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లతో ప్రత్యేకంగా చర్చించి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఏఈఆర్ఓలు వారం రోజుల పాటు ప్రతిరోజూ మూడు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, రోజువారీ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పనితీరు సంతృప్తికరంగా లేని సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఓటర్ మ్యాపింగ్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కొత్తగా విలీనం అయిన గ్రామాలు, కాలనీలు, అభివృద్ధి చెందిన కొత్త లేఅవుట్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్కు సంబంధించిన పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. ప్రతి ఓటరు వివరాలు ఖచ్చితంగా నమోదయ్యేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటరు జాబితా అత్యంత కీలకమైనదని, అందువల్ల ఎస్.ఐ.ఆర్ కార్యక్రమాన్ని ఒక సాధారణ పరిపాలనా కార్యక్రమంగా కాకుండా బాధ్యతగా భావించి పని చేయాలని అధికారులకు సూచించారు. నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా సాధించి జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలపాలని ఆకాంక్షించారు.ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, ఆర్డీఓ రాజేందర్, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి