ఒకే ఒక్కడు సినిమా చూపించాడు… 1995 చంద్రబాబుని తలపించిన లోకేష్
ఒకే ఒక్కడు సినిమా చూపించాడు… 1995 చంద్రబాబుని తలపించిన లోకేష్
GADDAM JAGANMOHAN REDDY
ఒకప్పుడు ఆకస్మిక తనిఖీలు, స్పాట్ సస్పెన్షన్లు అన్నవి పరిపాలనలో కఠినతను సూచించే చిహ్నాలుగా నిలిచాయి. అదే తరహా శైలిని గుర్తు చేస్తూ తాజాగా మంత్రి నారా లోకేష్ చేసిన చర్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై వచ్చిన ఫిర్యాదులు మంత్రి దృష్టికి వెళ్లాయి. పిల్లలే భోజనం బాగోలేదని చెప్పిన వీడియో బయటకు రావడంతో వెంటనే స్పందించిన మంత్రి, బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలకు అందించే భోజనం రుచి, శుభ్రత, పోషక విలువల్లో ఎలాంటి లోపం ఉండకూడదని స్పష్టం చేశారు.
ఈ ఘటన జరిగిన వారం రోజులకే లోకేష్ ఆకస్మిక తనిఖీతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మంగళగిరి సమీపంలోని చినకాకానిలో ఏపీఈడిబి కార్యాలయం ప్రారంభించిన అనంతరం షెడ్యూల్కు విరుద్ధంగా కాన్వాయ్ దారి మళ్లింది. ఏ సమాచారం లేకుండా నేరుగా మైలవరం పాఠశాలకు చేరుకున్న మంత్రి, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.
పిల్లలతో నేరుగా మాట్లాడిన ఆయన, వారి సమస్యలను తెలుసుకున్నారు. “మన పిల్లలకు ఇంట్లో ఎంత జాగ్రత్తగా భోజనం పెడతామో, అదే స్థాయి నాణ్యత విద్యార్థులకు ఉండాలి” అని స్పష్టం చేశారు. భోజనం నాణ్యత తగ్గితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు, భోజనం నచ్చకపోతే ఎలా ఫిర్యాదు చేయాలో కూడా విద్యార్థులకు వివరించారు. మంత్రి స్వయంగా భోజనం రుచి చూసి నాణ్యతను పరిశీలించారు.
హఠాత్తుగా మంత్రి పాఠశాలలో ప్రత్యక్షం కావడంతో స్థానికం నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకు ఒక్కసారిగా అలజడి నెలకొంది. ఒకరికి ఒకరు సమాచారం లేకపోవడంతో ఫోన్ కాల్స్ మోగిపోతూనే ఉన్నాయి. “మాకు తెలియదు” అంటూ అధికారులు పరస్పరం వివరణలు ఇచ్చుకుంటుండగా, మీడియా కూడా ఈ ఘటనను బ్రేకింగ్గా ప్రసారం చేసింది.
ఈ ఆకస్మిక తనిఖీతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో అప్రమత్తత పెరిగింది. 1995లో కనిపించిన పరిపాలనా కఠినతను మరోసారి గుర్తు చేస్తూ లోకేష్ చర్యలు రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి