నిమ్జ్ పనులు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
నిమ్జ్ పనులు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
Krishna
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (నిమ్జ్) పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను త్వరితగతిన సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా ఎస్పీ పరీతోష్ పంకజ్, టీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి. వీరారెడ్డితో కలిసి జహీరాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిమ్జ్ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూసేకరణ, భూముల అభివృద్ధి, పెండింగ్ సమస్యలు, ఫెన్సింగ్ పనులు, రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయాలపై అధికారులతో చర్చించారు.అంతకుముందు నిమ్జ్ భూముల మ్యాప్ను పరిశీలించిన కలెక్టర్ ఇప్పటివరకు సేకరించిన భూములు, ఇంకా సేకరించాల్సిన భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి పనులు ఆలస్యం కాకుండా చూడాలని సూచించారు. అవసరమైన యంత్రాలు, ఎక్విప్మెంట్ను పెంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిమ్జ్ ప్రాజెక్ట్ రాష్ట్ర అభివృద్ధికి కీలకమైందని, పరిశ్రమలు ఏర్పడితే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరిశ్రమల ఏర్పాటుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, సేకరించిన భూముల చుట్టూ పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించి మౌలిక సదుపాయాల పనులను నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.ఈ సమావేశంలో టీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీరారెడ్డి, జోనల్ మేనేజర్ విఠల్, నిమ్జ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశాలాక్షి, ఆర్డీఓ దేవూజ, తహసీల్దార్లు, పోలీస్ శాఖ అధికారులు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి