నీరు లేక నిట్టనిలువునా ఎండిన వరి… అన్నదాత ఆవేదన
నీరు లేక నిట్టనిలువునా ఎండిన వరి… అన్నదాత ఆవేదన
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మండలం తాళ్ల వెల్లంలలో సాగునీటి ఎద్దడి దారుణం
నల్గొండ జిల్లా చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామంలో సాగునీటి కొరత రైతులను తీవ్రంగా కుదిపేస్తోంది. బోర్లపై ఆధారపడి సాగు చేసిన వరి పంటలు కంకి దశలోనే ఎండిపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఒకటిన్నర ఎకరాల్లో వరి సాగు చేసిన మహిళా కౌలు రైతు ఆనంతుల పార్వతమ్మ పరిస్థితి ఈ ప్రాంత రైతుల దుస్థితిని ప్రతిబింబిస్తోంది.
భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో పంట నిట్టనిలువునా ఎండిపోగా, చివరకు పశువుల మేపుకే వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. పంటను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ట్యాంకర్కు రూ.800 చొప్పున నీరు కొనుగోలు చేసి పొలానికి పోశినా ఫలితం లేకపోవడంతో పెట్టుబడంతా వృథా అయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ప్రాంతంలో కాలువలకు నీరు రాకపోవడం, బోర్లు ఎండిపోవడం వల్ల పచ్చని పొలాలు ఎడారిలా మారుతున్నాయి. చేతికొచ్చే దశలో ఉన్న పంటలు కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రభుత్వ సాయం సకాలంలో అందకపోవడం, పెట్టుబడులు తిరిగి రాకపోవడం వల్ల అప్పుల భారంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో తమకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. ఉదయ సముద్రం నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామ చెరువులోకి నీటిని మళ్లిస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొంటున్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి