నేను చస్తే మీకు హ్యాపీనా?కన్నీళ్లతో కూలిపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు
నేను చస్తే మీకు హ్యాపీనా?కన్నీళ్లతో కూలిపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు
Biksham
స్థానికం ప్రతినిధి
సోషల్ మీడియా మోజు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి జీవితాన్నే తలకిందులు చేసింది. తరగతి గదిలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన వేళ రీల్స్ చేస్తూ, ప్రైవేటు సంస్థలను ప్రమోట్ చేస్తున్నారన్న ఆరోపణలతో ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు గౌతమిని విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
సస్పెన్షన్ అనంతరం గౌతమి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాను తెలిసీ చేయలేదని, వృత్తికి ఎప్పుడూ ద్రోహం చేయలేదని కన్నీళ్లతో వేడుకున్నారు. “నన్ను క్షమించి ఒక్క అవకాశం ఇవ్వండి. నేను ఎవరినైనా హత్య చేశానా? మత్తు పదార్థాలు అమ్మానా? నేను చస్తే మీకు హ్యాపీనా?” అంటూ బోరున విలపించారు.సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దారుణమైన ట్రోలింగ్ తనను మానసికంగా కుంగదీస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో తనను అన్యాయంగా దూషిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో జీవించలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని తీవ్ర వేదనతో చెప్పారు.కాగా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే ప్రైవేటు విద్యాసంస్థలు, కమర్షియల్ బ్రాండ్లకు ప్రకటనలు చేయడం, పాఠశాల సమయాల్లో రీల్స్ చేయడం వంటి అంశాలపై గౌతమిపై గతంలోనే ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతను విస్మరించి వ్యక్తిగత ప్రయోజనాలకు, సోషల్ మీడియాకు ప్రాధాన్యం ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపుపై పూర్తిగా దృష్టి సారించాలని సూచించారు.
మరోవైపు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. కొందరు “తప్పు చేసినా ఇంత తీవ్ర శిక్ష అవసరమా?” అంటూ గౌతమికి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు “సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాతైనా బాధ్యతగా పిల్లలకు పాఠాలు చెప్పాలి” అని సూచిస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఉద్యోగం మానేసి పూర్తిస్థాయి సోషల్ మీడియా ప్రభావశీలిగా మారాలని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ సంఘటన సోషల్ మీడియా మోజు, బాధ్యత మధ్య ఉన్న సున్నితమైన రేఖను మరోసారి సమాజానికి గుర్తు చేసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి