నేడే చిట్యాల పుర సమరం మున్సిపల్ పీఠం ఎవరిది?
నేడే చిట్యాల పుర సమరం మున్సిపల్ పీఠం ఎవరిది?
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపాలిటీలో ఎన్నికల సంగ్రామం క్లైమాక్స్కు చేరుకుంది. నేడు జరగనున్న పోలింగ్తో అభ్యర్థుల జాతకాలు బ్యాలెట్లలో నిక్షిప్తం కానున్నాయి. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో చిట్యాల గల్లీ గల్లీలో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. ఎవరికి వారు తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తుండగా, ఓటరు దేవుడు ఎవరిని వరిస్తాడోనన్న ఉత్కంఠ నెలకొంది.
అభ్యర్థుల ‘కాళ్లబేరం’.. సెంటిమెంట్ అస్త్రం!
వార్డుల్లో గెలుపు కోసం అభ్యర్థులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ, ఓటర్ల కాళ్లు పట్టుకుని మరీ అభ్యర్థిస్తున్నారు. కొన్ని వార్డుల్లోనైతే అభ్యర్థులు కన్నీటి పర్యంతమవుతూ తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని ‘కన్నీటి సెంటిమెంట్’ను అస్త్రంగా వాడుతున్నారు.“ఈ ఒక్కసారి గెలిపిస్తే వార్డును అభివృద్ధి చేస్తా.. లేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా” అంటూ భావోద్వేగ ప్రకటనలు చేస్తున్నారు.
ప్రలోభాల ‘ముసుగు’లో పోలింగ్..మున్సిపల్ ఎన్నికల వేళ ప్రలోభాల పర్వం అదుపులేకుండా సాగుతోంది. వార్డుల్లో మద్యం ఏరులై పారుతోంది. అర్థరాత్రి వేళల్లో అభ్యర్థులు చీరలు, నగదు పంపిణీకి తెరలేపారు.
డబ్బు ఇస్తేనే ఓటు:
“ఓటు వేయాలంటే పైసలు ఇవ్వాల్సిందే” అని ఓటర్లే తెగేసి చెబుతుండటం అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. కొన్ని చోట్ల చీరలు, మద్యం బాటిళ్లు పంచుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
మున్సిపల్ పీఠంపైనే అందరి చూపు..చిట్యాల మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్షాలు హోరాహోరీగాతలపడుతున్నాయి. ప్రధాన పార్టీల అగ్ర నాయకత్వం కూడా ఈ ఎన్నికలపై ప్రత్యేక నిఘా ఉంచింది. వార్డుల్లో సామాన్య ప్రజల నాడి ఎలా ఉందో అర్థం కాక నేతలు అయోమయంలో పడ్డారు.
ప్రలోభాలకు లొంగుతారా? లేక చైతన్యవంతమైన తీర్పునిస్తారా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
స్థానికo విన్నపం:
ఓటు మన హక్కు.. మన ఆయుధం. పైసలకు లొంగకుండా, నీతివంతుడిని ఎన్నుకుని చిట్యాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని స్థానికo కోరుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి