నల్గొండ నా ప్రాణం: 5సార్లు గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటా - మంత్రి కోమటిరెడ్డి!
నల్గొండ నా ప్రాణం: 5సార్లు గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటా - మంత్రి కోమటిరెడ్డి!
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
నల్గొండ నా ప్రాణం: 5సార్లు గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటా - మంత్రి కోమటిరెడ్డి!
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల తరుపున రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో అడుగడుగునా మంత్రికి నల్లగొండ పట్టణ ప్రజలు నీరాజనం పలికారు. మంచి చెడులో అండగా నిలిచే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటామని ప్రతినబూనారు. మంత్రి ప్రచారంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు.
మొదట చర్లపల్లి (15)వ డివిజన్ అభ్యర్థి పెరిక నాగరాజు, మర్రిగూడ 14 డివిజన్ అభ్యర్థి బొజ్జ శంకరయ్యకు మద్దతుగా చర్లపల్లి బొడ్రాయి చౌరస్తా వద్ద ప్రచారం నిర్వహించారు. అనంతరం 12వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మామిడి కార్తీక్, 27 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సట్టు నాగమణి శంకర్, 28వ డివిజన్ అభ్యర్థి గుండబోయిన పుష్పలత వెంకన్న, 29వ డివిజన్ అభ్యర్థి గులాబ్ మహమ్మద్ షఫిక్, 26వ డివిజన్ అభ్యర్థి అసిమా సుల్తాన్( బషీర్ ), 30 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మారగోని నవీన్ గౌడ్ తరపున విస్తృత ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ గా మార్చితే జరిగే లబ్ది, కార్పొరేటర్లు,కొత్త మేయర్ వస్తే జరిగే అభివృద్ధి,సంక్షేమం పై ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు.
"5 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నా నల్లగొండ ప్రజల రుణం తీర్చుకోలేనిదనీ,నల్లగొండ ప్రజలతో నాది విడదీయని ఆత్మీయబంధమన్నారు. నల్లగొండనే నా ఇల్లు... నల్లగొండనే నా ప్రాణం... నల్లగొండనే నా కుటుంబం.. నల్లగొండనే నా జీవితమని, పేదప్రజల మధ్యలో ఉండడం నాకిష్టం" అని మంత్రి పేర్కొన్నారు.
పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా తట్టుకోననీ, ప్రతి విద్యార్థిలో తన కొడుకును చూసుకుంటా..వారు ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు ఐతే సంతోషిస్తానని చెప్పారు. అందుకే ప్రతీక్ పేరు మీద ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించానని,పట్టణంలోని 18 ప్రభుత్వ స్కూల్స్ ను నాణ్యమైన విద్యను అందించే మోడల్ స్కూల్స్ గా మారుస్తానని తెలిపారు. తన చివరి శ్వాస వరకు పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తానని, నల్లగొండను, హైదరాబాద్ లాంటి నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. 48 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి క్లీన్ స్వీప్ చేస్తే..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి అధిక నిధులు తెస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరవేస్తానని,అభివృద్ధిలో నల్లగొండను నెంబర్ వన్ గా నిలుపుతానని అన్నారు. సన్న బియ్యంతో పేదవాడి ఆకలితీర్చడమే నిజమైన ఇందిరమ్మ రాజ్యంమని,10ఏళ్లు అధికారంలో ఉన్న వాళ్ళు కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు..డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట కాలయాపన చేశారనీ,ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లతో ఒక్కో ఇంటికి 5లక్షల ఆర్థిక సాయం చేస్తూ, పేదవాడి సొంతింటి కల నిజం చేస్తున్నామని తెలిపారు.
ఓటు కోసం ప్రతి పక్షాలు చెప్పే మాయమాటలు నమ్మవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వారికి ఓటు వేస్తే వృధానే అవుతుందని, నా దగ్గరికి మీ సమస్యలు తీసుకువచ్చే కాంగ్రెస్ కార్పొరేటర్లను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. పిల్లల చదువుకు,వైద్యానికి,ఏ ఆపద వచ్చిన ఆర్థిక సాయం చేయమని నా దృష్టికి తెచ్చే చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ కార్పొరేటర్లును గెలిపిస్తే..5 ఏళ్ల పాటు నల్లగొండ పట్టణ అభివృద్ధి నేను చూసుకుంటానని మంత్రి భరోసానిచ్చారు. తాను ఉండగా నల్లగొండలో శాంతి భద్రతలకు విఘాతం కలుగదనీ,అన్ని వర్గాల ప్రజలు తన వాళ్లే అని మంత్రి పునరుద్ఘాటించారు.. కులం,మతం బేదం లేకుండా అభివృద్దే లక్ష్యంగా సాగుదామని,అందుకు నల్లగొండ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు పలకాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి