నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం
నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం
స్థానికం బృందం
నల్గొండలో గణిత దినోత్సవ వేడుకలు… రామానుజన్ సేవలపై ప్రసంగాలు
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ డాక్టర్ మల్లేశ్వరి మాట్లాడుతూ, రామానుజన్ జీవితం, ఆయన గణిత రంగానికి అందించిన అపూర్వమైన సేవలను ఉదాహరణలతో సహా ఆసక్తికరంగా వివరించారు. అధికారిక విద్య పరిమితంగా ఉన్నప్పటికీ, స్వయంకృషితో గణితంలో అసాధారణ ప్రతిభ కనబరిచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తిగా రామానుజన్ నిలిచారని చెప్పారు. చిన్న వయసులోనే గణితంపై అపారమైన ఆసక్తితో క్లిష్టమైన సూత్రాలను స్వయంగా ఆవిష్కరించారని తెలిపారు.
అలాగే ఆయన ప్రతిభను గుర్తించిన బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త జి. హెచ్. హార్డీ సహకారంతో ఇంగ్లాండ్లో పరిశోధనలు కొనసాగించి, నంబర్ థియరీ, ఇన్ఫినిట్ సిరీస్, మ్యాథమెటికల్ ఫార్ములాస్ వంటి రంగాల్లో గణనీయమైన కృషి చేశారని పేర్కొన్నారు. తక్కువ వయసులోనే మరణించినప్పటికీ, ఆయన చేసిన సేవలు గణిత ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోయాయని అన్నారు. డిసెంబర్ 22న ఆయన జన్మదినాన్ని దేశవ్యాప్తంగా జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ, రామానుజన్ అసాధారణ ప్రతిభ విద్యార్థులకు ఎప్పటికీ ప్రేరణనిచ్చేదిగా ఉంటుందని అన్నారు. కష్టపడి చదివితే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందవచ్చన్న సందేశాన్ని ఆయన జీవితం అందిస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు వివిధ గణిత పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మ్యాథమెటిక్స్ విభాగానికి చెందిన లెక్చరర్లు డాక్టర్ డి. మధుకర్, కే. కనకయ్య, పార్వతి, శోభ, బాల కార్తిక్, మతిన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి