మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి
Biksham
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని జిల్లాలు పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఫోటో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన ఫోటో ఓటరు తుది జాబితా ప్రకటించామని, ఈ నెల 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటన జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించిన అనంతరం ఈ నెల 16న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్ల గుర్తింపు, ఇతర అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ జారీకి ముందే ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తుది ఓటరు జాబితా, ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా, తుది పోలింగ్ కేంద్రాల జాబితాను ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రకటించి, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి
నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, సెక్టోరియల్ అధికారులు, నామినేషన్ స్వీకరణ కేంద్రాలు, ఎన్నికల సామాగ్రి పంపిణీ–స్వీకరణ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లు, పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు తదితర అన్ని అంశాలపై ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు సాఫీగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, ఆర్డీఓ వేణు మాధవ్, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి