మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
Biksham
సూర్యాపేట జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ చర్యలు
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ తెలిపారు. ఈనెల 11వ తేదీన సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలలో జరగనున్న రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఐదు మున్సిపాలిటీ కేంద్రాలలో మొత్తం 141 వార్డులకు గానూ 372 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వాటిలో 115 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల కోసం 1250 మంది పోలీసు సిబ్బందితో రక్షణ బందోబస్తు నిర్వహణకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పటిష్ట నిఘా కొనసాగుతోందని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ఉచితాలు, బహుమతులు, డబ్బు, మద్యం వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకసారి ఎన్నికల కేసుల్లో చిక్కుకుంటే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు తప్పవని స్పష్టం చేశారు.ఎన్నికల ప్రచార సమయం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని, ఆ తర్వాత ఎవ్వరూ ప్రచారం చేయరాదని తెలిపారు. స్థానికేతరులు, ఓటర్లు కానివారు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉండకూడదని సూచించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని కోరారు.ఎన్నికల నిర్వహణలో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని, ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ బాధ్యతలతో నియమించామని, ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ విధులు నిర్వహిస్తుందని వెల్లడించారు.ఓటర్లు స్వేచ్ఛగా, భయరహితంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి