ముగ్గురు కొడుకులున్నా ఆకలితో విలవిలలాడుతున్న వృద్ధ తల్లి
ముగ్గురు కొడుకులున్నా ఆకలితో విలవిలలాడుతున్న వృద్ధ తల్లి
Biksham
బుక్కెడు అన్నం కోసం ఎదురుచూస్తున్న 95 ఏళ్ల వెంకమ్మ
కొడుకులకు బుద్ధి చెప్పి ఆదుకోవాలని అధికారులకు వేడుకోలు
సూర్యాపేట: మోతే మండలం నామవరం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ ఓ వృద్ధ తల్లి బుక్కెడు అన్నం కోసం ఎదురుచూస్తూ నిస్సహాయ స్థితిలో జీవిస్తోంది.
గ్రామానికి చెందిన నల్లగంతుల వెంకమ్మ (95) భర్త మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించాడు. ఆమెకు పాపయ్య, వెంకన్న, ఎల్లయ్య అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. తండ్రి మరణానంతరం తల్లిని చూసుకుంటామని చెప్పిన కుమారులు, ఆమె పేరుమీద ఉన్న మూడు ఎకరాల తొమ్మిది గుంటల భూమిని తమ పేర్లకు మార్చించుకున్నారు. అనంతరం తల్లిని పట్టించుకోకుండా ఒంటరిగా వదిలేశారు.
ఆకలితో అలమటిస్తున్న వెంకమ్మ స్థానికుల సహాయంతో జిల్లా కేంద్రంలోని ఆదాయ విభాగాధికారిని సంప్రదించింది. స్పందించిన అధికారి ముగ్గురు కుమారులను పిలిపించి ప్రతి ఒక్కరు నెలకు పదిహేనువందల రూపాయలు చొప్పున తల్లికి ఇవ్వాలని ఆదేశించారు. అయినప్పటికీ ఆ ఆదేశాలను పట్టించుకోకుండా కుమారులు వెళ్లిపోయినట్లు సమాచారం.
దిక్కుతోచని స్థితిలో కుమార్తె వద్దకు వెళ్లిన వెంకమ్మ, ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో నడుము విరిగి మరింత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కుమార్తె కూడా పోషణలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.
తనకు బుక్కెడు అన్నం పెట్టాలని, కొడుకులకు బుద్ధి చెప్పి తగిన న్యాయం చేయాలని వెంకమ్మ స్థానికులు, జిల్లా కలెక్టర్ సహా సంబంధిత అధికారులను వేడుకుంటోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి