మీసేవ కేంద్రంలో అధిక ఫీజుల వసూళ్లు… టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు
మీసేవ కేంద్రంలో అధిక ఫీజుల వసూళ్లు… టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు
Komidala Mahender reddy
వినియోగదారుల ఫిర్యాదులపై అధికారుల దృష్టి
నల్గొండ జిల్లాలోని నార్కెట్పల్లి పట్టణంలో ఉన్న ఓ మీసేవ కేంద్రంపై అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.ఈ దాడుల్లో భాగంగా నల్గొండ కలెక్టరేట్కు చెందిన దుర్గారావు ఈడీఎం, నార్కెట్పల్లి తహసీల్దార్ ఎల్. వెంకటేశ్వర్ రావు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె.వి. తరుణ్ తదితర అధికారులు పాల్గొన్నారు. మీసేవ కేంద్రంలో సేవలు పొందుతున్న ప్రజల నుండి ప్రత్యక్షంగా వివరాలు సేకరించారు. అదేవిధంగా ఫిర్యాదు చేసిన వ్యక్తిని పిలిపించి విచారణ జరిపారు.తనిఖీల సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించిన రుసుముల కంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర నిర్వాహకులకు అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయించిన ధరలకంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఫిర్యాదుదారులు, వినియోగదారులు మరియు కేంద్ర సిబ్బంది నుండి సేకరించిన సమాచారంతో సమగ్ర నివేదికను తయారు చేసి జిల్లా కలెక్టర్కు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.ఇకపై మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన రుసుములే చెల్లించాలని వినియోగదారులకు సూచించారు. ఎక్కడైనా అధిక వసూళ్లు జరిగితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
నార్కెట్పల్లి పట్టణంలోని "నాని నెట్ సెంటర్" పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జరిగిన ఈ తనిఖీలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. నిర్వాహకురాలు శోభా రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రంపై తదుపరి చర్యలపై అధికారుల నివేదిక అనంతరం స్పష్టత రానుంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి