మత్తుపై సమరం బాలల రక్షణ, భద్రతకు పెద్దపీట..
మత్తుపై సమరం బాలల రక్షణ, భద్రతకు పెద్దపీట..
NM Yadav
నేటి నుంచే జిల్లాలో సంక్షేమ వారోత్సవాలు..
ప్రజావాణి అర్జీలను వెనువెంటనే పరిష్కరించాలి..
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశం..
నల్గొండ : జిల్లాలో మత్తు పదార్థాల రహిత సమాజం దిశగా అడుగులు వేయాలని ముఖ్యంగా యువతను, విద్యార్థులను ఈ వ్యసనాల నుంచి కాపాడాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా.. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన 'ప్రజావాణి'లో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు నిర్వహించనున్న ‘బాలల భద్రత, రక్షణ మరియు మత్తు పదార్థాలకు నో చెప్పండి’ సంక్షేమ వారోత్సవాల కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
విద్యార్థులపై ప్రత్యేక దృష్టి..
మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పోలీస్, విద్యా, సంక్షేమ శాఖల సమన్వయంతో మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఈ వారంలోనే జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మత్తు పదార్థాల విముక్తి కేంద్రాన్ని (డీ-అడిక్షన్ సెంటర్) అందుబాటులోకి తీసుకురావాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు.
పాలనలో వేగం.. పారదర్శకత..
వచ్చే నెల నుండి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 'ఈ-ఆఫీస్' విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఫైళ్లన్నీ ఆన్లైన్ ద్వారానే పంపాలని కలెక్టర్ ఆదేశించారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు. అలాగే జిల్లాలో నిరుద్యోగ యువత కోసం త్వరలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలుపుతూ.. అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను ఈ నెల 30లోగా యువజన సర్వీసుల శాఖకు అందజేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ గృహ నిర్మాణాలు పూర్తయిన చోట వెంటనే గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేయాలని ప్రజలు తమ స్వీయ జనగణనను త్వరగా పూర్తి చేసేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మంగళవారం జిల్లాకు రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ రానున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత దరఖాస్తులు, రిజిస్టర్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదును ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తోందని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని తెలిపారు. కాగా ఈ సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో రెవెన్యూ విభాగానికి 58, ఇతర శాఖలకు 39 చొప్పున మొత్తం 97 ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, ట్రైనీ ఐఏఎస్ ఎన్. శ్రీకాంత్ రెడ్డి, ఆర్డీవోలు రమణారెడ్డి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి