మున్సిపాలిటీ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం – సూర్యాపేటకు న్యాయం మా పార్టీతోనే
మున్సిపాలిటీ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం – సూర్యాపేటకు న్యాయం మా పార్టీతోనే
Biksham
సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట మున్సిపాలిటీకి న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అదే నినాదంతో రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండి, పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య అన్నారు.
సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికలపై జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ, సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరపున ఒక్కో వార్డుకు పది మంది వరకు పోటీ పడుతున్నారని తెలిపారు. అయితే అర్హత, అంకితభావం, పార్టీకి విధేయత, గెలుపు సామర్థ్యం ఉన్న అభ్యర్థులకే టికెట్లు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు.
పార్టీ టికెట్ రాని వారు టికెట్ పొందిన అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీ నుంచి తొలగించడమే కాకుండా, తిరిగి పార్టీలోకి చేర్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
సూర్యాపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి, మున్సిపాలిటీ గెలుపును దివంగత నాయకులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి అంకితం చేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐకమత్యంతో పనిచేయాలని, ప్రతి వార్డులో సీనియర్ సిటిజన్స్, ఉద్యోగులు, మహిళలతో సమావేశాలు నిర్వహించి గెలుపు దిశగా వ్యూహరచన చేయాలని సూచించారు.
వార్డుల వారీగా ఓటర్ జాబితా ఇప్పటికే సిద్ధంగా ఉందని, ఓటర్ లిస్టులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలవాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించేలా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికల కోసం ప్రతి వార్డులో కోఆర్డినేటర్లను నియమిస్తామని, జిల్లా అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య ఆధ్వర్యంలో వారు పనిచేస్తారని తెలిపారు.
చిన్న చిన్న పొరపాట్లే పార్టీపై పెద్ద ప్రభావం చూపుతాయని, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఈనెల 5వ తేదీ నుంచి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ వార్డులకు పోటీ చేస్తే ప్రతి వార్డుకు విడివిడిగా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారితో మాట్లాడి పార్టీలో చేర్పించాలని, పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని యాక్టివ్గా ఉంచి ప్రతి కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. 2014లో టికెట్ రాని కొందరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని, ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి