మైరా మురిపెంలో… పరమశివుని చెంత మంత్రి పొంగులేటి దంపతులు
మైరా మురిపెంలో… పరమశివుని చెంత మంత్రి పొంగులేటి దంపతులు
Biksham
మహాశివరాత్రి వేళ తీర్థాల, కూసుమంచి, బెండాలపాడు క్షేత్రాల్లో కుటుంబ సమేతంగా పూజలు
వేద ఆశీర్వచనాల మధ్య ఘన స్వాగతం
ఖమ్మం : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో భక్తి వాతావరణం నెలకొంది. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాధురి దంపతులు తమ ముద్దుల మనుమరాలు మైరాతో కలిసి ఆదివారం ఆధ్యాత్మిక పర్యటన చేపట్టారు. పసిప్రాయంలోనే భక్తి భావంతో స్వామివారిని దర్శించుకుంటున్న మైరా మురిపెంలో మంత్రి కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికంలో మునిగితేలారు.
తీర్థాల సంగమేశ్వరుని దర్శనం
మంత్రి కుటుంబం తొలుత ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం ను దర్శించుకుంది. త్రివేణి సంగమ క్షేత్రంలో వెలసిన స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. పూర్ణకుంభ స్వాగతంతో ఆలయ అధికారులు మంత్రి దంపతులను ఆహ్వానించి శేషవస్త్రాలతో సత్కరించారు.
కూసుమంచి గణపేశ్వరుని సన్నిధిలో
అనంతరం కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన శ్రీ గణపేశ్వర స్వామి ఆలయం లో స్వామివారిని దర్శించుకున్నారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య విశేష పూజల్లో పాల్గొని ఆశీర్వచనాలు స్వీకరించారు.
బెండాలపాడు వీరభద్రుడికి నీరాజనం
పర్యటనలో భాగంగా చండ్రుగొండ మండలం బెండాలపాడులోని శ్రీ వీరభద్రస్వామి ఆలయం ను సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు ఆత్మీయ స్వాగతం పలికారు. వీరభద్రుడి సన్నిధిలో నిర్వహించిన విశేష పూజల్లో మంత్రి దంపతులు, చిన్నారి మైరా పాల్గొన్నారు.
రాష్ట్ర సుభిక్షత కోసం ప్రార్థనలు
దర్శనానంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, “మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో విరాజిల్లాలని, తెలంగాణ రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆ పరమశివుడిని ప్రార్థించాను” అని తెలిపారు.
ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహాశివరాత్రి వేళ మంత్రి కుటుంబం చేపట్టిన ఈ ఆధ్యాత్మిక పర్యటన భక్తుల్లో విశేష ఆసక్తిని కలిగించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి