మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు
మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు
Harish HS
మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు – ట్రాఫిక్ ఎస్ఐ బైరెడ్డి అంజిరెడ్డి
మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపితే తల్లిదండ్రులపై కూడా కఠిన చర్యలు తప్పవని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ బైరెడ్డి అంజిరెడ్డి హెచ్చరించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం పట్టణంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైనర్లు ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ఘటనలను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.పట్టణంలోని పలు ప్రధాన రహదారులపై చేపట్టిన తనిఖీలలో ఆరుగురు మైనర్లు ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని ఎస్ఐ వివరించారు. వయస్సు నిండకముందే వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఇది చట్టపరంగా కూడా నేరమని చెప్పారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కూడా మోటార్ వెహికల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని ఎస్ఐ అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, వాహనాలకు సంబంధిత పత్రాలు కలిగి ఉండటం వంటి అంశాల్లో నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు.
మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు గురిచేసే పరిస్థితులు తల్లిదండ్రులు సృష్టించకూడదని, పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా వ్యవహరించాలని ఎస్ఐ బైరెడ్డి అంజిరెడ్డి సూచించారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిపై నిరంతరం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వెంట హెడ్ కానిస్టేబులు బాల్త్ శ్రీనివాస్, గంట సత్యనారాయణ, హోంగార్డు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి