మైలవరంలో మకిలి పట్టిన మధ్యాహ్న భోజనం – విద్యార్థుల ఆగ్రహం
మైలవరంలో మకిలి పట్టిన మధ్యాహ్న భోజనం – విద్యార్థుల ఆగ్రహం
GADDAM JAGANMOHAN REDDY
ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని తారకరామానగర్ ప్రాథమిక పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాచిపట్టిన అన్నం, నాసిరకం ఆహారం అందించడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లేట్లలో వడ్డించిన భోజనం తినలేమంటూ చిన్నారులు ఆహారాన్ని డస్ట్బిన్లలో పారబోసి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు పాఠశాల వద్దకు చేరుకుని వంట ఏజెన్సీ నిర్వాహకులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా “సార్… మా ఆహారం బాగోలేదు. మాకు మంచి భోజనం పెట్టించండి సార్” అంటూ చిన్నారులు వేడుకోవడం అక్కడ ఉన్న వారిని కలచివేసింది. పిల్లల ఆవేదన చూసి పోలీసులు కూడా భావోద్వేగానికి గురయ్యారు.
ఇదిలా ఉండగా, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని విషయంపై ప్రశ్నించగా, తాను పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వంట ఏజెన్సీ నిర్వాహకులు తన మాటలను పట్టించుకోవడం లేదని ఆమె తెలిపారు.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా చూడాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి