Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 11:45 PM

మహిళా జర్నలిస్టులకు బెదిరింపులు.

మహిళా జర్నలిస్టులకు బెదిరింపులు.

మహిళా జర్నలిస్టులకు బెదిరింపులు.
February 10, 2026 06:52 PM 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ప్రొ. బషీరుద్దీన్ స్మారకోపన్యాసంలో ప్రొ. పద్మజా షా వ్యాఖ్యలు

భారతదేశంలో మహిళా జర్నలిస్టులు నేడు చట్టపరమైన బెదిరింపులు, వృత్తిపరమైన ఒంటరితనం, నిరంతర ఆన్‌లైన్ వేధింపులతో తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తున్నారని ఉస్మానియా విశ్వవిద్యాలయ జర్నలిజం విభాగ విశ్రాంత అధ్యాపకురాలు ప్రొ. పద్మజా షా ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల స్వేచ్ఛా అభిప్రాయాలకు పాలకులు విలువ ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ పాత్రికేయులు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ప్రొ. యస్. బషీరుద్దీన్ 90వ జయంతి సందర్భంగా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బషీరుద్దీన్ చిత్రపటానికి నివాళి అర్పించి “జర్నలిజంపై మహిళల ప్రభావం” అనే అంశంపై స్మారకోపన్యాసం చేశారు.

ప్రొ. పద్మజా షా మాట్లాడుతూ, ప్రొ. బషీరుద్దీన్ జర్నలిజం విభాగాన్ని దూరదృష్టితో అభివృద్ధి పథంలో నడిపించారని, ముఖ్యంగా మహిళలను నైపుణ్యంతో పాటు ఆత్మవిశ్వాసం కలిగిన పాత్రికేయులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు చట్టపరమైన, సామాజిక, మేధోపరమైన అడ్డంకులను అధిగమిస్తూ జర్నలిజాన్ని పునర్నిర్మించారని తెలిపారు.

మహిళా పాత్రికేయులు లింగ సమానత్వం, హక్కులు, న్యాయం కోసం పోరాడుతూ పరిశోధనాత్మక జర్నలిజానికి పునాది వేశారని పేర్కొన్నారు. గృహశ్రమను ఆర్థిక పనిగా, విద్యను పౌరహక్కుగా, మహిళలపై హింసను వ్యక్తిగత అంశంగా కాకుండా ప్రజా నేరంగా సమాజం ముందు ఉంచడంలో మహిళా జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. స్వర్ణ కుమారి దేవి, పండిత రామాబాయి, మాలిని సుబ్రహ్మణ్యం, నేహా దీక్షిత్, రేవతి, స్వాతి చతుర్వేది, రీతు సైరిన్ వంటి మహిళా పాత్రికేయుల సేవలను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రొ. బషీరుద్దీన్ విశ్వవిద్యాలయ అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని, అంబేద్కర్ విశ్వవిద్యాలయ మౌలిక వసతుల ఏర్పాటులో ఆయన పాత్ర కీలకమని తెలిపారు. సమాజాన్ని జాగృతం చేయడంలో మీడియా మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News