మహిళా సంక్షేమానికే తొలి ప్రాధాన్యం
మహిళా సంక్షేమానికే తొలి ప్రాధాన్యం
స్థానికం బృందం
మహిళా సంక్షేమానికే తొలి ప్రాధాన్యం
బోరంచలో ఘనంగా చీరల పంపిణీ
స్థానిక ప్రతినిధి నారాయణఖేడ్
నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలంలోని బోరంచ గ్రామంలో మహిళా సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చీరల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవ్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం గ్రామస్థాయిలో సక్రమంగా కొనసాగింది. కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప నేతృత్వంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పంచగామ బీరప్ప మాట్లాడుతూ… పేద, మధ్యతరగతి మహిళలపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు వారి గౌరవం, ఆత్మవిశ్వాసం పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి అర్హురాలైన మహిళకు చీర అందజేస్తామని స్పష్టం చేశారు. మహిళలు కుటుంబానికే కాదు, సమాజ నిర్మాణానికి కూడా పునాదులని పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా గ్రామాల్లో ప్రత్యక్షంగా ప్రజల చేతికి చేరుతున్నాయంటే అది ప్రజా ప్రభుత్వం–ప్రజా పాలన కృషికి నిదర్శనమని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళల జీవితాల్లో ప్రభుత్వ పథకాలు మార్పులు తీసుకొస్తున్నాయని చెప్పారు. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సామాజిక సమానత్వానికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.
గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, అందుకే మహిళా సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని పథకాలు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనపెట్టి గ్రామస్థాయిలో సంక్షేమ కార్యక్రమాల అమలుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సక్రమంగా అమలయ్యేలా ప్రజలంతా సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా సంఘాల అధ్యక్షురాలు సాయమ్మ, వీఓఏ బైండ్ల అనసుజ, వార్డు సభ్యుడు బాలకృష్ణ, గ్రామ దేవస్థానం చైర్మన్ మల్లయ్య, గ్రామ పెద్దలు నర్సింహులు, యువత, వివిధ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి