లక్ష కు ఐదు లక్షల నకిలీ నోట్లు!
లక్ష కు ఐదు లక్షల నకిలీ నోట్లు!
NM Yadav
నల్ల రంగు కాగితాలతో మోసం చేస్తూ
అమాయకులకు కుచ్చుటోపి
విదేశీ కేటుగాడి అరెస్ట్..
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..
నల్లగొండ : రంగు పూసిన కాగితాలను రసాయనంతో కడిగితే అసలు నోట్లుగా మారుతాయని నమ్మబలికి అమాయకులను మోసం చేస్తున్న పశ్చిమ ఆఫ్రికాకు చెందిన నిందితుడిని తిప్పర్తి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ కేసు వివరాలను వెల్లడించారు. పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశానికి చెందిన గోయిటా సౌంగాలో (53) రెండేళ్ల క్రితం భారత్కు వచ్చాడు.
తొలుత బెంగళూరులో పండ్లు విక్రయిస్తూ జీవనం సాగించిన అతడు అనంతరం హైదరాబాద్లోని టోలిచౌకి ప్రాంతానికి మకాం మార్చాడు.
జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మరో నిందితుడు సల్మాన్ అలియాస్ ఉమా దాలియాతో కలిసి నకిలీ కరెన్సీ పేరుతో మోసాలకు తెరలేపాడు. వాట్సాప్ ద్వారా అమాయకులను సంప్రదించి ఒక లక్ష అసలు రూపాయలకు ఐదు లక్షల విలువైన 500 నోట్లు ఇస్తామని నమ్మబలికేవారు. నల్ల రంగు పూసిన నోట్లను ప్రత్యేక రసాయనంతో కడిగి అసలు నోట్లుగా మార్చి ప్రదర్శన ఇచ్చి బురిడీ కొట్టించేవారు.ఈ నెల 6న తిప్పర్తి మండలం మల్లేపల్లి వారిగూడెం దాబా వద్ద వంగూరి జానయ్య అనే వ్యక్తికి రూ. 5 లక్షల విలువైన కరెన్సీ కట్ట అని చెప్పి రూ. లక్ష వసూలు చేశారు. పైభాగంలో నాలుగు అసలు నోట్లు పెట్టి లోపల నల్లటి కాగితాలు ఇచ్చారు. ఇంటికి వెళ్లి రసాయనంతో కడిగినా అవి మారకపోవడంతో జానయ్య తాను మోసపోయినట్లు గుర్తించాడు. నిందితుడిని పట్టుకోవాలని పథకం పన్ని తన స్నేహితుడు అభిరామ్ సహాయంతో మరో రూ. 10 లక్షల నోట్లు కావాలని నిందితుడిని సంప్రదించాడు. గురువారం మధ్యాహ్నం తిప్పర్తి రైల్వే స్టేషన్ వద్దకు వచ్చిన నిందితుడిని బాధితులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
రసాయనాలు, నకిలీ కాగితాల స్వాధీనం..
నిందితుడి నుంచి నాలుగు కట్టల నల్లటి కాగితాలు, రసాయన ద్రావణం, పౌడర్, ఒక మొబైల్ ఫోన్ మరియు నాలుగు అసలు 500 రూపాయల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వీసా గడువు 2024 ఆగస్టులోనే ముగిసినట్లు గుర్తించారు. గతంలో ఇతనిపై మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసును ఛేదించిన డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐ కొండల్ రెడ్డి, ఎస్సై శంకర్ మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. తక్కువ డబ్బుకు ఎక్కువ కరెన్సీ ఇస్తామనే మోసగాళ్ల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి