కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి
కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి
Editor Desk
: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొండపై కొనసాగుతున్న వర్తక సంఘాన్ని రద్దు చేసి దుకాణాలకు బహిరంగ టెండర్లు నిర్వహించాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
ప్రస్తుతం వర్తక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న 10 దుకాణాల ద్వారా సంవత్సరానికి కేవలం రూ.1.68 కోట్లు మాత్రమే దేవస్థానానికి ఆదాయం వస్తోందని కమిటీ సభ్యులు తెలిపారు. అదే టెండర్ల ద్వారా కేటాయిస్తే రూ.20 నుంచి రూ.30 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఈనెల 31తో దుకాణాల గడువు ముగియనున్న నేపథ్యంలో వెంటనే టెండర్ ప్రక్రియ చేపట్టాలని కోరారు.
కొండకింద అన్నదానం కాంప్లెక్స్ వద్ద ఉన్న 112 షాపింగ్ కాంప్లెక్స్లకు కూడా టెండర్లు నిర్వహిస్తే దేవస్థానానికి ఆదాయం పెరగడంతో పాటు స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కొందరే ఏళ్ల తరబడి దుకాణాలను కొనసాగించడం వల్ల దేవస్థాన ఆదాయానికి నష్టం జరుగుతోందని ఆరోపించారు.
దేవస్థాన అభివృద్ధి, భక్తుల సౌకర్యాల పెంపు కోసం పారదర్శక టెండర్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాటబత్తిని ఆంజనేయులు, బండ రామస్వామి, దండబోయిన వీరేష్, బండి వాసు, కర్రె ప్రవీణ్, బండి అనిల్, కొన్నె సంజీవ, గుండ్లపల్లి లింగం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి