క్యాన్సర్ను ముందే గుర్తిస్తే ప్రాణాపాయం తగ్గింపు
క్యాన్సర్ను ముందే గుర్తిస్తే ప్రాణాపాయం తగ్గింపు
Biksham
మూడు వందల మందికి ఉచిత నిర్ధారణ పరీక్షలు – ఎంఎస్ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో శిబిరం
క్యాన్సర్ను తొలి దశలో గుర్తిస్తే నివారణ సులభమవుతుందని, అందుకోసం అవగాహనతో పాటు నిర్ధారణ పరీక్షలు కీలకమని ఎంఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత కొల్లు మధుసూదన్ రావు, కొంగర భవాని ట్రస్టు అధ్యక్షుడు కొంగర రామచంద్రరావు తెలిపారు. కీ.శే. కొంగరి భవాని స్మారకార్థం, ఎంఎస్ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పరిశోధన సంస్థ సహకారంతో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం గురువారం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో ఉన్న ఎంఎస్ఆర్ కిడ్జ్ పాఠశాలలో ఈ శిబిరాన్ని ప్రారంభించి వారు మాట్లాడుతూ నేటి సమాజంలో క్యాన్సర్ ప్రమాదకర వ్యాధిగా మారిందన్నారు. చాలాసార్లు చివరి దశలోనే గుర్తించబడడంతో చికిత్స కష్టమై ప్రాణాపాయం పెరుగుతోందని తెలిపారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే తక్కువ ఖర్చుతో చికిత్స పొందవచ్చని చెప్పారు.
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి విభాగాధిపతి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అనుమానాస్పద గడ్డలు, మానని పుండ్లు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్యాన్సర్ లక్షణాలు మొదట్లో స్పష్టంగా కనిపించవని, ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకుంటే ముందస్తు గుర్తింపు సాధ్యమవుతుందని తెలిపారు.ముందస్తుగా నమోదు చేసుకున్న రెండు వందల మందితో పాటు మరో వందమందికి మొత్తం సుమారు మూడు వందల మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఆర్ విద్యాసంస్థల ప్రతినిధి కొల్లు శ్రీనివాసరావు, చేతన ఫౌండేషన్ అధ్యక్షుడు సీతారామయ్య, వైద్యులు రవిశంకర్, శైలజ, మాన్విత, రేడియాలజీ నిపుణుడు ప్రభాకర్, నర్సింగ్ సిబ్బంది, సూర్యాపేట చందన నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి