క్షయ వ్యాధి నిర్మూలనకు సమగ్ర చర్యలు
క్షయ వ్యాధి నిర్మూలనకు సమగ్ర చర్యలు
Biksham
సూర్యాపేట జిల్లాలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించి క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు.
ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో గాంధీ పార్క్ నుండి ప్రభుత్వ వైద్య కళాశాల వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వైద్య కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణకు అవసరమైన అన్ని పరీక్షలు, చికిత్స సదుపాయాలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా రూ.20 లక్షల వ్యయంతో మొబైల్ ఎక్స్ రే యంత్రం ద్వారా జనవరి 2025 నుండి 52,901 మందికి పరీక్షలు నిర్వహించగా, 1,741 మందికి వ్యాధి నిర్ధారణ అయిందని, వారిలో 1,356 మంది పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. ప్రస్తుతం 385 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
ఇప్పటివరకు 21 గ్రామ పంచాయితీలను క్షయ ముక్త గ్రామాలుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. మరిన్ని గ్రామాలను క్షయ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ క్షయ యోధులుగా పని చేయాలని సూచించారు.
క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించి లక్ష్యాలను చేరుకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. జిల్లాలోని మూడు క్షయ కేంద్రాల అభివృద్ధికి మూడు లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించారు. క్షయ ముక్త గ్రామాలుగా నిలిచిన సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, వైద్య సిబ్బందిని ప్రశంసా పత్రాలతో సత్కరించారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వెంకటరమణ, కార్యక్రమ అధికారి ప్రసీద్, వైద్యులు నాజియా తబస్సుమ్, గురురాజు, ఈశ్వరమ్మ, శ్రీకాంత్ భట్, జనార్ధన్, వెంకట పాపిరెడ్డి, ఉప వైద్య ఆరోగ్య అధికారులు చంద్రశేఖర్, మాధవ్ కుమార్, రెవెన్యూ అధికారి వేణు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి