కార్పొరేట్ విద్యాసంస్థల బ్రాండ్ అంబాసిడర్గా మారిన సీఎం రేవంత్ రెడ్డి.
కార్పొరేట్ విద్యాసంస్థల బ్రాండ్ అంబాసిడర్గా మారిన సీఎం రేవంత్ రెడ్డి.
Sthanikam District Staff Reporter
- ప్రభుత్వ విద్యను కావాలనే దెబ్బతీస్తున్న ప్రభుత్వం
- జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు లావుడియ రాజు
భువనగిరి:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండనీయమని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ మండిపడింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన బాధ్యత వహించాల్సిన సమయంలో,కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలకు బహిరంగంగా మద్దతు తెలపడం అత్యంత ఆందోళనకరమని పేర్కొంది.రాష్ట్రంలో వందలాది ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి నెలకొని ఉండగా,వాటిని రక్షించాల్సిన ప్రభుత్వం వాటి బలహీనతలను ఎత్తిచూపడం ద్వారా ప్రజల్లో అవిశ్వాసం పెంచే ప్రయత్నం చేస్తోందని ఎస్ఎఫ్ఐ విమర్శించింది.విద్యార్థులకు సరైన పాఠన నైపుణ్యాలు లేవని చెప్పడం ద్వారా ప్రభుత్వ విద్యను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించింది. విద్యాశాఖపై పూర్తి బాధ్యత కలిగిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు తగిన నిధులు కేటాయించకుండా,ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా,మౌలిక వసతులు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది.అదే సమయంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు భారీ ప్రకటనలతో విద్యార్థులను ఆకర్షించేందుకు పోటీ పడుతుండగా ప్రభుత్వం నిశ్చేష్టంగా ఉండటం దురదృష్టకరమని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తాను ప్రారంభించిన ప్రైవేట్ పాఠశాలను తన “బ్రెయిన్ చైల్డ్”గా పేర్కొనడం ద్వారా తానే ఆ రంగానికి ప్రత్యక్ష ప్రోత్సాహకుడిగా,బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారని ఎస్ఎఫ్ఐ మండిపడింది. ఇది విద్య హక్కు చట్టానికి విరుద్ధమైన దిశలో ప్రభుత్వాన్ని నడిపించే చర్యగా అభివర్ణించింది.గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉండగా,నగరాల్లో ప్రైవేట్ విద్యాసంస్థల ఆధిపత్యం పెరిగిపోతోందని,దీనివల్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందని పేర్కొంది. తల్లిదండ్రులు బలవంతంగా ప్రైవేట్ పాఠశాలల వైపు మళ్లే పరిస్థితిని ప్రభుత్వం సృష్టిస్తోందని విమర్శించింది.రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించే చట్టాన్ని వెంటనే తీసుకురావాలని, ప్రభుత్వ విద్యను పునరుద్ధరించేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది.ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని,అన్ని ప్రభుత్వ పాఠశాలలకు తగిన మౌలిక వసతులు కల్పించాలని కోరింది. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు,తల్లిదండ్రులతో కలిసి భారీ ఆందోళనలు చేపడతామని ఎస్ఎఫ్ఐ హెచ్చరించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి