కలుషిత నీరే తాగునీరు. రోగాల బారిన పడుతున్న ప్రజలు
కలుషిత నీరే తాగునీరు. రోగాల బారిన పడుతున్న ప్రజలు
Editor Desk
మిషన్ భగీరథ నీరు అందించి సమస్య పరిష్కరించాలి
మామునూరులో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన
ఎర్రుపాలెం, మామునూరు గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని, కలుషిత నీరు సరఫరా కావడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని సీపీఎం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు ఆరోపించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్తులు శనివారం ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అయ్యేదని, అయితే గత ఎనిమిది నెలలుగా నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. ప్రస్తుతం పశువులు సేదతీరే మామునూరు పేట చెరువు నీటిని శుద్ధి చేయకుండా నేరుగా గ్రామ ట్యాంకుకు ఎక్కించి ప్రజలకు సరఫరా చేస్తున్నారని విమర్శించారు.
నీటిలో జలగాలు, పాచి, బురద మురుగు ఉండటంతో దుర్వాసన వస్తోందని, ఆ నీటిని తాగడం వల్ల గ్రామస్థులు జీర్ణకోశ, చర్మవ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి వైద్యం చేయించుకున్నా మళ్లీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.
ప్రభుత్వం, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే స్వచ్ఛమైన సురక్షితమైన తాగునీరు అందించాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అనంతరం గ్రామ సర్పంచ్ షేక్ పెద్దబాబు సాహెబ్, ఉపసర్పంచ్ మారబత్తుల ఆదిలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి నరేంద్రరెడ్డికి గ్రామస్థుల సంతకాలతో కూడిన వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో షేక్ లాల్ సాహెబ్, కన్నేబోయిన శ్రీనివాసరావు, షేక్ కరీం, బేతు శ్రీను, వేల్పుల స్వామి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి