ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగర నడిబొడ్డున మాదిగ అమరవీరుల ఆత్మగౌరవ స్థూపాన్ని నిర్మించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా వెంకటేష్ మాదిగ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, మాదిగ దండోరా ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందన్నారు.
32 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ సామాజిక న్యాయం కోసం నిరంతర పోరాటం చేస్తోందని, ఆ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల సేవలను సమాజం ఎన్నటికీ మరవదన్నారు. మాదిగ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం మాదిగ అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే మూడు ఎకరాల్లో మాదిగ అమరవీరుల స్మృతి వనం, ఆత్మగౌరవ స్థూపం నిర్మించాలని, దండోరా ఉద్యమకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, తెలంగాణ ఉద్యమకారుల తరహాలో దండోరా ఉద్యమకారులకు గుర్తింపు కల్పించి 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.
జులై 7న జరిగే ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని జిల్లా వెంకటేష్ మాదిగ పిలుపునిచ్చారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి