ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలకు సమగ్ర ఏర్పాట్లు
ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలకు సమగ్ర ఏర్పాట్లు
Biksham Goud
శాఖల సమన్వయంతో నిరాటంక నిర్వహణకు చర్యలు : జిల్లా కలెక్టర్
సూర్యాపేట త్వరలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్, పదవ తరగతి వార్షిక పరీక్షలకు అన్ని శాఖలు సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్ సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం పరీక్షల నిర్వహణపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు, వైద్య, సమాచార, పంచాయతి రాజ్, రవాణా, విద్యుత్తు, ఆర్టీసీ, ట్రెజరి, పోస్టల్, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో ఎటువంటి అంతరాయం కలగకుండా భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రశ్న, జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య మూసివేసిన వాహనాలలో మాత్రమే తరలించాలని సూచించారు. ప్రశ్నాపత్రాల భద్రతకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
జిల్లాలో మొత్తం 69 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పర్యవేక్షణ కోసం ఫ్లైయింగ్ దళాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అదనపు బస్సులు నడపాలని రవాణా అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖను సూచించారు.
పరీక్షా కేంద్రాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్ర వాతావరణం కల్పించాలని పంచాయతి, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భాను నాయక్, జిల్లా పంచాయతి అధికారి యాదగిరి, పోలీసు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి