ఇసుక దోపిడీకి చెక్ చిర్రగూడూర్ అభివృద్ధే లక్ష్యం
ఇసుక దోపిడీకి చెక్ చిర్రగూడూర్ అభివృద్ధే లక్ష్యం
Biksham
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
నూతన సర్పంచ్ చిత్తలూరి సోమనారాయణ
స్థానికం ప్రతినిధి బిక్షం
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని చిర్రగూడూర్ గ్రామంలో నూతన సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికై గెలుపొందిన చిత్తలూరి సోమనారాయణ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనపై నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ శుభాభివందనాలు తెలిపారు. తనను నమ్మి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
చిర్రగూడూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయిన బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గ్రామ ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహించి బొడ్రాయి పండుగ జరుపుతామని చెప్పారు.
గ్రామంలో గత పాలకుల హయాంలో జరిగిన ఇసుక దోపిడీని ఎమ్మెల్యే మందుల సామేలు సహకారంతో పూర్తిగా అరికడతామని స్పష్టం చేశారు. గ్రామ అవసరాలకు తప్ప ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తే ఊరుకునేది లేదన్నారు. గ్రామంలో సుమారు 40కి పైగా ట్రాక్టర్లు ఉన్నాయని, ఏ ఒక్క ట్రాక్టర్ ద్వారా అక్రమంగా ఇసుక తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని తెలిపారు. జానకిపురం నుంచి చిర్రగూడూర్ వరకు ఉన్న లింక్ రోడ్డును ఎమ్మెల్యే సహకారంతో బీటీ రోడ్డుగా పూర్తి చేస్తామని అన్నారు. గ్రామ ప్రజల సహకారంతో చిర్రగూడూర్ను మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
చదువులో ముందుండే విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి అండగా ఉంటానని, గ్రామ యువకుల సహకారంతో ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం గ్రామపంచాయతీకి పక్కా భవనం లేకపోవడంతో, ఎమ్మెల్యే సహాయంతో ఆధునిక సదుపాయాలతో గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు.
గత పాలకులు రైతులను ఇబ్బందులకు గురిచేసి నాయకులు లబ్ధి పొందారని విమర్శించారు. ఇకపై రైతులను ఇబ్బంది పెట్టే ఎలాంటి అక్రమాలకు అవకాశం ఇవ్వబోమని, ఇసుక దోపిడీని పూర్తిగా అరికడతామని చిత్తలూరి సోమనారాయణ స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి