ఇంటి నంబర్లు లేని ఇండ్ల సమస్యకు పరిష్కారం..
ఇంటి నంబర్లు లేని ఇండ్ల సమస్యకు పరిష్కారం..
NM Yadav
నల్గొండలో క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలన..
మంత్రి కోమటిరెడ్డి చొరవతో కదలిక 9,645 ఇళ్ల సమస్య పరిష్కారానికి చర్యలు..
నల్గొండ : నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏళ్ల తరబడి ఇంటి నంబర్లు, సరైన లింకు పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్న వేలాది మంది గృహస్థుల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమవుతోంది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో ఈ ప్రక్రియ వేగవంతమైంది. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు.
మంత్రి ఆదేశాలతో రంగంలోకి..
గురువారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల సమీక్షా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ అంశాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నల్గొండ నగర పరిధిలో సుమారు 9,645 ఇళ్లకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి.. తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
బస్తీల్లో కలెక్టర్ పర్యటన..
మంత్రుల ఆదేశాల మేరకు శుక్రవారం కలెక్టర్ చంద్రశేఖర్ రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పానగల్ సమీపంలోని వడ్డెర వాడ, ఐటీ టవర్ ఎదురుగా ఉన్న సుందరయ్య కాలనీలలో ఇంటింటికీ వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.పత్రాలు లేకపోవడానికి గల కారణాలను నేరుగా గృహస్థులను అడిగి తెలుసుకున్నారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్నా సాంకేతిక కారణాలతో ఆగిపోయిన ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. వేలాది ఇళ్లకు త్వరలోనే అధికారిక గుర్తింపు లభించనుండటంతో బాధితుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి