ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతం చేయాలి
ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతం చేయాలి
Biksham Goud
మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
ఒకే చోట 2,160 ఇండ్ల నిర్మాణం – పారదర్శక లబ్ధిదారుల ఎంపికకు ఆదేశాలు
హుజూర్నగర్; రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకే చోట 2,160 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి పేదలకు అందిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల మరియు నీటిపారుదల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం హుజూర్నగర్లోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాలలో సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల స్థలాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నిర్వహణాధికారి గౌతమ్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్లతో కలిసి పరిశీలించారు.
అనంతరం మంత్రి నివాస కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, 2011లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హుజూర్నగర్ నియోజకవర్గంలోని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, బియ్యం మిల్లుల కార్మికులకు ఆశ్రయం కల్పించాలనే లక్ష్యంతో 110 ఎకరాల దేవాలయ భూములను మార్కెట్ ధరకు కొనుగోలు చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఆ పనులు నిలిచిపోయి ప్రదేశం నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 14 సంవత్సరాల పట్టుదలతో తిరిగి పనులను ప్రారంభించి పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రతి ఇంటికి సుమారు ఆరు లక్షల రూపాయలు వ్యయం చేయగా, ఒక్కింటి విస్తీర్ణం 325 చదరపు అడుగులుగా ఉంటుందని వివరించారు. అంతర్గత రహదారులు, విద్యుత్, త్రాగునీరు, కాలువల కోసం 75 కోట్ల రూపాయలు మంజూరు చేయించి పనులను వేగంగా పూర్తి చేయించినట్లు వెల్లడించారు.
మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మొదటి విడతగా హుజూర్నగర్ పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలు, తెల్ల రేషన్ కార్డు కలిగిన వెయ్యి మంది లబ్ధిదారులకు ఇండ్లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రెండవ విడతలో నియోజకవర్గంలోని ఇతర అర్హులైన పేదలకు ఇండ్ల పంపిణీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఛైర్పర్సన్, తహసీల్దార్లు నిజమైన అర్హులను ఎంపిక చేయాలని ఆదేశించారు. ఎంపిక ప్రక్రియలో అవినీతి, అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఎస్పీ కే నరసింహ, మున్సిపల్ ఛైర్పర్సన్ దొంతగాని శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి