భువనగిరి టౌన్, : పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకొని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సీపీఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ డిమాండ్ చేశారు. సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని రైతుబజార్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే యుద్ధ పరిస్థితుల పేరుతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, సామాన్యులు, ఉద్యోగులు, పేదలపై తీవ్ర భారం పడుతోందన్నారు. రోజువారీ కూలీలు, ఉద్యోగుల జీతాలు పెరగని పరిస్థితిలో ఇంధన ధరల పెంపు ప్రజల నడ్డి విరిచేలా ఉందని విమర్శించారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఇతర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాక పది రోజుల్లోనే ధరలు పెంచడం ప్రజలను మభ్యపెట్టడమేనని ఆరోపించారు. పెంచిన ధరలు ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యవర్గ సభ్యులు బందల ఎల్లయ్య, వనం రాజు, కమిటీ సభ్యులు వల్లాస్ అంజయ్య, చింతల శివ, ఈర్ల రాహుల్, జూకంటి పావుల్, జగ్గులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి