హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి
హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి
Biksham Goud
స్థానికం ప్రతినిధి
హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని సూర్యాపేట జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి లింగయ్య, అదనపు జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాతి సవేందర్ కుమార్ డిమాండ్ చేశారు.బ్లాక్ కోట్స్ ఫర్ బ్లూ రేవల్యూషన్ అనే నినాదంతో గత 25 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా మహాత్మ జ్యోతిబాపూలే, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో అంకితభావంతో పనిచేస్తున్న ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ సేవలు హర్షనీయమని వారు అభినందించారు.సూర్యాపేట జిల్లా బార్ అసోసియేషన్ హాల్లో గురువారం ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కొంపెల్లి లింగయ్య, నాతి సవేందర్ కుమార్లు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ కారణంగా అనేక వృత్తులు కనుమరుగవుతున్నాయని, ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామీణ స్థాయి నుంచి బడుగు బలహీన వర్గాల యువత గత పదేళ్లుగా న్యాయవాద వృత్తిని ఎంచుకొని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ వృత్తిలో కొనసాగుతున్నారని తెలిపారు. సరైన నేపథ్యం లేకపోవడంతో న్యాయస్థానాల్లో వారికి సముచిత అవకాశాలు లభించటం లేదని పేర్కొన్నారు.హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఆయా వర్గాలు వెనుకబడి ఉన్నాయని, అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించాలని వారు కోరారు. క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం యువ న్యాయవాది కట్ట సుధాకర్ గౌడ్ను ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా నామినేట్ చేశారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, రాష్ట్ర కార్యదర్శి తల్లమల్ల హసేన్, మాజీ అధ్యక్షులు వసంత సత్యనారాయణ పిల్లే యాదవ్, నూకల సుదర్శన్ రెడ్డి, గుడిపూరి వెంకటేశ్వరరావు, కాకి రామిరెడ్డి, ఉపాధ్యక్షులు గుంటూరు మధు, పూర్వ ప్రభుత్వ సహాయ న్యాయవాది డప్పుకు మల్లయ్య, లీగల్ ఎయిడ్ డిప్యూటీ కౌన్సిల్ బోల్లెద్దు వెంకటరత్నం, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి