గుర్రంపోడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
గుర్రంపోడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
Komidala Mahender reddy
రూ.20 వేల లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అరెస్ట్
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్రంపోడు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహమ్మద్ అబ్దుల్ హకీమ్ను రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఫిర్యాదుదారునికి సంబంధించిన సర్వే నెం.225/6లోని 1.15 ఎకరాల భూమి వివరాలు ఆన్లైన్ 1-బి (ROR) రిజిస్టర్ నుండి తొలగించబడటంతో, వాటిని పునరుద్ధరించేందుకు దరఖాస్తు స్వీకరించి సంబంధిత ఫైల్ను తహశీల్దార్కు ప్రాసెస్ చేసి పంపేందుకు రూ.20,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు నిందితుడిని పట్టుకున్నారు.
నిందిత అధికారి సూచన మేరకు లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ విధిని నిజాయితీగా నిర్వహించక అక్రమ లాభం పొందేందుకు ప్రయత్నించినందుకు మహమ్మద్ అబ్దుల్ హకీమ్ను అరెస్ట్ చేసి, హైదరాబాద్లోని ఏసీబీ విచారణ కోర్టు మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుని వివరాలను గోప్యంగా ఉంచినట్లు స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినట్లయితే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలను కోరారు. వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (Telangana ACB), ఎక్స్/ట్విట్టర్ (@Telangana ACB) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ బహిరంగ ప్రదేశాల్లో ఏసీబీ సంప్రదింపుల కోసం క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అవినీతిని నిర్మూలించాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి