గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న గ్రామస్తులు
గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న గ్రామస్తులు
Anjali
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం రెడ్డిపల్లిలో సత్యసాయి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా తాగునీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలోని బీసీ కాలనీలో వందకు పైగా ఇళ్లు ఉన్నప్పటికీ ఒక్క కొళాయి మాత్రమే ఉందని, అందులోనూ నీరు సరిగా రావడం లేదని మహిళలు తెలిపారు. కనీసం ఒక్కింటికి ఒక బిందెడు నీరు కూడా అందడం లేదని వాపోయారు. ఇదే నీటిని తాగునీటిగా వినియోగిస్తున్నామని, ఒకే కొళాయితో అందరికీ నీరు పట్టుకోవడం అసాధ్యమని చెప్పారు. కాలనీలో కనీసం మూడు లేదా నాలుగు కొళాయిలు ఏర్పాటు చేస్తే సమస్య కొంతవరకు తీరుతుందని సూచించారు.వేసవి కారణంగా నీటి అవసరం పెరిగిన సమయంలో సరఫరా నిలిచిపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీరు కొనుగోలు చేయాల్సి వస్తోందని తెలిపారు. అయితే శుద్ధజలం పేరుతో తీసుకొచ్చే ట్యాంకర్ నీరు తాగితే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. వెంటనే సత్యసాయి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా, సమస్యల పరిష్కారం కోరుతూ సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు నల్లమాడ పంపుహౌజ్ వద్ద ఆరు రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. తమకు రావలసిన వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే బకాయి వేతనాలు చెల్లించి నీటి సరఫరా పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని బీసీ కాలనీ వాసులు కోరారు.
ఈ నిరసనలో చెన్నకృష్ణమ్మ, శివమ్మ, లక్ష్మి, లక్ష్మీనరసమ్మ, వెంకటరమణమ్మ, నరసమ్మ, అక్కమ్మ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి