గీతం భూముల క్రమబద్ధీకరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ సమరశంఖం
గీతం భూముల క్రమబద్ధీకరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ సమరశంఖం
స్థానికం బృందం
ప్రభుత్వ కుట్రను అడ్డుకుంటాం – నేతల హెచ్చరిక
విశాఖపట్నం:స్థానికం ప్రధాన ప్రతినిధి
విశాఖపట్నం నగరంలో సుమారు ఐదు వేల కోట్ల రూపాయల విలువైన 54 ఎకరాలు 79 సెంట్ల ప్రభుత్వ భూమిని, విశాఖ పార్లమెంట్ సభ్యులకు చెందిన గీతం విద్యా సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం పన్నిన కుట్రను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ నెల 30న జరగనున్న విశాఖ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని అజెండాగా పెట్టి, తీర్మానం ద్వారా భూముల క్రమబద్ధీకరణకు యత్నిస్తున్నారని పార్టీ ఆరోపించింది.ఈ నేపథ్యంలో, వివాదాస్పద గీతం కళాశాల పరిసరాల్లోని ప్రభుత్వ భూములను వైఎస్ఆర్సీపీ అగ్రనేతలు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర ప్రాంత సమన్వయకర్త కురసాల కన్నా బాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు, విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ…
ప్రజలకు చెందాల్సిన వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు విద్యా సంస్థలకు ధారాదత్తం చేయడం ఘోర అన్యాయమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నగర పాలక సంస్థ వేదికగా ఈ భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు.
ఈ అక్రమ తీర్మానాన్ని వెంటనే ఉపసంహరించుకునే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యతని, ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం ప్రజలందరూ వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలవాలని నేతలు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా, నియోజకవర్గ, మండల, వార్డు స్థాయి నాయకులు, పార్టీ ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి