గ్రామ జీవనాధారమైన చెరువును కాపాడాలి – తహసిల్దార్కు వినతిపత్రం
గ్రామ జీవనాధారమైన చెరువును కాపాడాలి – తహసిల్దార్కు వినతిపత్రం
Krishna
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని పిచేర్యాగడి పాత తాండ గ్రామ శివారులో ఉన్న సర్వే నంబర్–100 నరసింహారెడ్డి చెరువుపై జరిగిన అక్రమ ఆక్రమణలను వెంటనే తొలగించి, చెరువును అసలు విస్తీర్ణంలో పునరుద్ధరించాలని తాండ సర్పంచ్ రామావత్ భీమి బాయి సోమవారం కోహిర్ తహసిల్దార్ సుప్రియకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామానికి జీవనాధారంగా ఉన్న నరసింహారెడ్డి చెరువు గతంలో సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండేదని, అయితే అక్రమ ఆక్రమణల కారణంగా ప్రస్తుతం దాని విస్తీర్ణం సుమారు 7 ఎకరాలకు మాత్రమే పరిమితమైందని తెలిపారు. చెరువు విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల వర్షాకాలంలో సరైన నీటి నిల్వలు లేకపోతుండటంతో పాటు భూగర్భ జలాలపై, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.గ్రామ ప్రజలకు తాగునీరు, సాగునీటి అవసరాలతో పాటు పశుపోషణకు ఎంతో కీలకమైన ఈ చెరువును కాపాడుకోవడం అత్యవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సంయుక్తంగా సమగ్ర విచారణ చేపట్టి, చెరువుపై జరిగిన అన్ని అక్రమ ఆక్రమణలను పూర్తిగా తొలగించి, నరసింహారెడ్డి చెరువును అసలు విస్తీర్ణంలో పునరుద్ధరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కోహిర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు రాథోడ్ వినోద్ కుమార్ పాల్గొని సర్పంచ్ వినతికి మద్దతు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి