గర్భిణికి తప్పిన గండం.. యశోద వైద్యుల అద్భుతం!
గర్భిణికి తప్పిన గండం.. యశోద వైద్యుల అద్భుతం!
K.RAVI
అత్యంత అరుదైన 'ప్లాసెంటా పెర్క్రిటా'కు విజయవంతంగా చికిత్స
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ గర్భిణికి మలక్పేట యశోద ఆసుపత్రి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. వైద్య శాస్త్రంలోనే అత్యంత క్లిష్టమైనదిగా భావించే 'ప్లాసెంటా పెర్క్రిటా' (మాయ గర్భాశయ గోడలను చీల్చుకుని బయటకు రావడం) సమస్యతో పోరాడుతున్న బాధితురాలిని మల్టీ డిసిప్లినరీ బృందం సమన్వయంతో కాపాడింది.నగరానికి చెందిన 27 ఏళ్ల మహిళ (28 వారాల గర్భిణి) తీవ్రమైన కడుపునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోయే స్థితిలో ఆసుపత్రికి వచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆమె గర్భాశయం చిట్లిపోయిందని (Uterine Rupture), కడుపులో అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం జరుగుతోందని గుర్తించారు. రక్తపోటు పడిపోయి బాధితురాలు అప్పటికే 'హెమరేజిక్ షాక్'లోకి వెళ్లడంతో పరిస్థితి విషమంగా మారింది.ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టరు ఎం.వి. జ్యోత్స్న ఆధ్వర్యంలో క్రిటికల్ కేర్, అనస్థీషియా నిపుణుల బృందం రంగంలోకి దిగింది. శస్త్రచికిత్స సమయంలో ఆమె కడుపులో సుమారు 3 లీటర్ల రక్తం గడ్డకట్టి ఉండటాన్ని గమనించారు.గర్భాశయానికి ఎడమవైపున 4 \ 4 సెం.మీ రంధ్రం పడింది. వైద్యులు వెంటనే లాపరోటమీ నిర్వహించి, రక్తస్రావాన్ని అదుపులోకి తెచ్చారు. రక్తం, ప్లాస్మా, ప్లేట్లెట్లను ఎక్కించి బాధితురాలి ప్రాణాలను నిలబెట్టారు.
పునర్జన్మ ప్రసాదించారు..
శస్త్రచికిత్స అనంతరం ఐసీయూలో నిరంతర పర్యవేక్షణతో బాధితురాలు వేగంగా కోలుకున్నారు. "ఇలాంటి కేసుల్లో నిమిషాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవడం కీలకం. సరైన సమయంలో రోగ నిర్ధారణ చేసి చికిత్స అందించడం వల్లే ప్రాణాపాయం తప్పింది" అని డాక్టర్ జ్యోత్స్న పేర్కొన్నారు. అత్యున్నత ప్రమాణాలతో వైద్యం అందించి బాధితురాలిని కాపాడిన వైద్య బృందాన్ని యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ గోరంట్ల రావు అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి