గద్దర్ ఒక వ్యక్తి కాదు… ఒక ఉద్యమం: సిపిఐ నాయకులు
గద్దర్ ఒక వ్యక్తి కాదు… ఒక ఉద్యమం: సిపిఐ నాయకులు
Krishna
సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి
నారాయణఖేడ్ అంబేద్కర్ భవన్లో ప్రజా యుద్ధనౌక, తెలంగాణ పోరాటయోధుడు గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) జయంతిని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆనంద్తో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకుడు చిరంజీవి మాట్లాడుతూ, గద్దర్ ఒక వ్యక్తి కాదని, ఒక ఉద్యమమని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పోరాట గళమని కొనియాడారు. అణచివేత,అన్యాయం,అసమానతలకు వ్యతిరేకంగా తన ఆటపాటలు, కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన మహనీయుడు గద్దర్ అని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల పోరాట చరిత్రలో గద్దర్ పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు.సమాజంలో కుల, మత, వర్గ వివక్షలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన గొంతుక గద్దర్ అని, ఆయన పాటలు ప్రజల్లో చైతన్యాన్ని నింపి ఉద్యమాలకు దిశానిర్దేశం చేశాయని అన్నారు. గద్దర్ జయంతిని పురస్కరించుకుని ఆయన పేరుతో ఒక అవార్డును స్థాపించి, ప్రతి సంవత్సరం కవులు, కళాకారులు, సినీ రంగ ప్రముఖులకు ప్రదానం చేయాలని సిపిఐ పార్టీ నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గద్దర్ ఆలోచనలు, పాటలు, పోరాట స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని, ప్రజల మధ్య శాశ్వతంగా జీవిస్తాయని అన్నారు. ఆయన కలలైన సమానత్వ సమాజం కోసం ప్రతి ఒక్కరూ పోరాట పథంలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు చిరంజీవి, అశోక్, ప్రేమ్ రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశాంత్ జాన్తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి