ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : టీవీసీసీ చైర్మన్ ముత్తినేని వీరయ్య
ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : టీవీసీసీ చైర్మన్ ముత్తినేని వీరయ్య
Editor Desk
యాదగిరిగుట్ట
వికలాంగుల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ (టీవీసీసీ) చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా వికలాంగులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాలపై రాష్ట్ర సదస్సు శుక్రవారం యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో ఘనంగా ప్రారంభమైంది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులను ప్రారంభిస్తూ సంఘ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల్లో 5 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని తెలిపారు. 3.75 కోట్ల నిధులతో 80 వేల మంది వికలాంగులతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి ఆర్థిక సాధికారత కల్పిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో 4,372 మంది వికలాంగులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించామని, రెండో దఫాలో మరో 5 శాతం ఇండ్లు వికలాంగులకు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కోర్టు ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని పేర్కొన్నారు.
ఆరు సంవత్సరాల లోపు అంగవైకల్యం ఉన్న చిన్నారులకు ‘బాల భరోసా’ పథకం ద్వారా ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వయం ఉపాధి పొందుతున్న వికలాంగులకు రిట్రోఫిటెడ్ వాహనాలు అందజేస్తున్నామని, అవసరమైన సహాయ పరికరాలు కూడా అందిస్తున్నామని చెప్పారు.
వికలాంగులపై దాడులు, దౌర్జన్యాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వికలాంగులకు చేరవేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి కొత్త చేయూత పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. వికలాంగుల పెన్షన్ల పెంపుపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా నిరుద్యోగ యువతకు అందించే రుణాల్లో వికలాంగులకు 5 శాతం కేటాయింపులు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇద్దరు వికలాంగులు వివాహం చేసుకుంటే రూ.2 లక్షల వివాహ ప్రోత్సాహకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
అనంతరం ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య మాట్లాడుతూ వికలాంగుల హక్కుల పరిరక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. వికలాంగుల చట్టాలను బలహీనపరిచే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ల పెంపును ఆలస్యం చేస్తోందని, ఫేస్ రికగ్నిషన్ పేరుతో అర్హులైన లబ్ధిదారుల పెన్షన్లు రద్దు చేసే ప్రయత్నాలు జరిగితే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో వికలాంగులకు నామినేటెడ్ పదవులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమాజంలో వికలాంగులపై కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కోశాధికారి ఆర్.వెంకటేష్, భువనగిరి జిల్లా అధ్యక్షుడు సూరపంగా ప్రకాశ్, జిల్లా కార్యదర్శి వనం ఉపేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.స్వామి, కోశాధికారి కొత్త లలిత, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలరాజు గౌడ్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెంకటేష్, పీఎన్ఎం జిల్లా కార్యదర్శి ముత్యాలు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లౌడియా రాజు, ఎన్పీఆర్డీ రాష్ట్ర నాయకులు రాజు, యశోద, నాగలక్ష్మి, కాశప్ప తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి