చిలకలూరిపేట : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న నిర్వహించనున్న “చలో విజయవాడ” కార్యక్రమానికి సంబంధించిన సమరశంఖం పోస్టర్ను చిలకలూరిపేట పట్టణంలోని ఎస్టియు ప్రాంతీయ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్టియు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే.కోటేశ్వరరావు, రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై తక్షణం స్పందించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం చేపట్టిన ఈ పోరాటంలో వెనుకడుగు ఉండదని, ప్రభుత్వ మౌనం ఇక
సహించబోమని హెచ్చరించారు.
హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆగదు
ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆర్థిక బకాయిలకు పేస్స్లిప్లు జారీ చేసి వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, మెమో నెం.57 ప్రకారం 2004 సెప్టెంబర్ 1లోపు నియామకమైన డీఎస్సీ-2003 ఉపాధ్యాయులు, పోలీసు మరియు ఇతర ఉద్యోగులకు పాత పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు.
ఉద్యోగ విరమణ చేసిన వారికి పెన్షన్ ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని, ఉపాధ్యాయులపై బోధనేతర విధులు తొలగించాలని ఎస్టియు డిమాండ్ చేసింది.
స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ
ఫిబ్రవరి 25న జరిగే చలో విజయవాడ కార్యక్రమం అనంతరం కూడా ప్రభుత్వం స్పందించనిచో ఉపాధ్యాయ–ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్టియు పల్నాడు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు బొంత రవి, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి వినుకొండ అక్కయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు విజయకుమార్, చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి వడ్లన జయప్రకాష్, మండల అధ్యక్షులు షేక్ మస్తాన్వలి, ప్రధాన కార్యదర్శి వడితే రమణనాయక్, అట్లూరి శ్రీనివాసరావు, సోమల నాయక్, ఎస్టి సీనియర్ నాయకులు చావల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి