ఎస్సీ,ఎస్టీ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి సూర్యఘర్ పథకం దోహదం: మంత్రి సవిత
ఎస్సీ,ఎస్టీ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి సూర్యఘర్ పథకం దోహదం: మంత్రి సవిత
Prakash
సోమందేపల్లి (శ్రీ సత్యసాయి జిల్లా):ఎస్సీ, ఎస్టీ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన’ పథకం కీలకంగా మారుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవిత అన్నారు. పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండలం, సోమందేపల్లి ఎస్సీ కాలనీలో ఈ పథకం కింద ఏర్పాటు చేసిన 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ప్యానెల్ను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఆర్థికంగా బలపడే అవకాశముందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 2514 మంది లబ్ధిదారులకు ఉచితంగా సోలార్ ప్యానెల్లు అందజేస్తామని, సోమందేపల్లి మండలంలో 600 మంది లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు.
సౌర విద్యుత్ వినియోగంతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటంతో పాటు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెరుగుతుందని, అదనంగా ఉత్పత్తి అయ్యే మిగులు విద్యుత్ను ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆదాయం జమ అవుతుందని వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సౌర విద్యుత్ అందేలా అధికారులు కృషి చేయాలని ఆమె ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనాలు పూర్తిగా చేరేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సబ్సిడీ వివరాలు, దరఖాస్తు విధానం, సాంకేతిక సహాయం వంటి అంశాలను గ్రామ స్థాయిలో స్పష్టంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే సోమందేపల్లి మండల కేంద్రంలో సుమారు రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, త్వరలో మిగిలిన పనులను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో SE మోసెస్ విద్యుత్ శాఖ అధికారులు, సంబంధిత విభాగాల సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి