ఎంజీయూలో నీళ్ల కరువు.. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా..
ఎంజీయూలో నీళ్ల కరువు.. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా..
NM Yadav
ట్యాంకర్ నీళ్ల తో హస్టళ్లలో విద్యార్థుల స్నానాలు.
అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థి లోకం ఆగ్రహం.
నల్లగొండ: నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నెలకొన్న తీవ్రమైన నీటి సమస్యను నిరసిస్తూ గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు హాస్టళ్ల వద్ద భారీ ఆందోళన చేపట్టారు. గత నెల రోజులుగా హాస్టళ్లలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి.
కనీసం స్నానం చేయడానికి కూడా నీళ్లు లేని దుస్థితి ఏర్పడటంపై విద్యార్థి నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏబీవీపీ యూనివర్సిటీ అధ్యక్షుడు హనుమాన్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ పరిపాలన విభాగం వైఫల్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని విమర్శించారు. అనేకమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోవడం బాధాకరమన్నారు.
ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా అవి హాస్టల్ గదుల వరకు చేరడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ ప్రాథమిక అవసరాల కోసం బయట స్నానాలు చేయాల్సిన దుర్భర పరిస్థితి నెలకొందని వారు ధ్వజమెత్తారు. యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న కొత్త భవన నిర్మాణాల కోసం నీటిని మళ్లించడం వల్లే హాస్టళ్లలో ఈ సంక్షోభం తలెత్తిందని హనుమాన్ ఆరోపించారు. విద్యార్థుల అవసరాలను గాలికొదిలేసి కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయమని ఆయన ఖండించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి