ఏళ్లుగా ఊడిపడిన జియో వైర్లు.. నిదానపల్లిలో అధికారుల నిర్లక్ష్యం
ఏళ్లుగా ఊడిపడిన జియో వైర్లు.. నిదానపల్లిలో అధికారుల నిర్లక్ష్యం
Editor Desk
నిదానపల్లిలో ఫైబర్ నెట్ ఫెయిల్యూర్
ఏళ్లుగా నేలమీదే జియో వైర్లు.. మౌనంగా అధికారులు
యాదాద్రి భువనగిరి జిల్లా
రామన్నపేట స్థానికం ప్రతినిధి
డిజిటల్ గ్రామాలంటూ గొప్పలు చెప్పుకుంటున్న పాలనకు నిదానపల్లి గ్రామం అద్దంలా నిలుస్తోంది. రామన్నపేట మండలంలోని ఈ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది.
గ్రామానికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో రోడ్ల వెంబడి స్తంభాలపై ఏర్పాటు చేసిన జియో ఫైబర్ కేబుల్ వైర్లు ఏళ్లుగా ఊడిపడి నేలమీదే కనిపిస్తున్నాయి. కాలం గడుస్తున్నా వాటి వైపు సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పొలాలకు వెళ్లే రైతులు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు గ్రామ రహదారులు దాటేటప్పుడు ఈ వైర్లు అడ్డుపడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చన్న భయం గ్రామాన్ని వెంటాడుతున్నా, అధికార యంత్రాంగం మాత్రం నిర్లక్ష్య ధోరణినే కొనసాగిస్తోంది.
అభివృద్ధి పేరుతో ఏర్పాటు చేసిన మౌలిక వసతులే ఇప్పుడు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పూర్తిగా కొరవడడమే ఈ దుస్థితికి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా ఇంటర్నెట్ విభాగానికి చెందిన అధికారులు స్పందించి, నేలమీద ఊడిపడి ఉన్న ఫైబర్ కేబుల్ వైర్లను వెంటనే తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత అధికారులదేనని హెచ్చరిస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి