విద్యార్థులు సమరశీల పోరాటాలను తీవ్రతరం చేయాలి
విద్యార్థులు సమరశీల పోరాటాలను తీవ్రతరం చేయాలి
Biksham
పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ పిలుపు
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
విద్యార్థులు సమరశీల పోరాటాలను మరింత తీవ్రతరం చేయాలని పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ పిలుపునిచ్చారు. పిడిఎస్యు సూర్యాపేట జిల్లా 23వ మహాసభ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ యానాల వీరారెడ్డి నగర్, సాయి గౌతమి కళాశాలలో జిల్లా నాయకులు భీమనపల్లి ప్రకాష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి అమరవీరులకు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో కాంపాటి పృథ్వీ, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడుతూ విద్య ఒక అంగడి సరుకులా మారి పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులో భాగమైన సమాన విద్య, వైద్య అవకాశాలు నీటిమీద రాతలా మారాయని విమర్శించారు.
నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ఉన్న కొద్దిపాటి విద్యా అవకాశాలను కూడా దూరం చేసేలా పాలకులు కుట్రలు చేస్తున్నారని, హేతువాద భావనలు, ప్రజాస్వామిక విలువలు, సామాజిక చైతన్యాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. కాలం చెల్లిన మనుధర్మాన్ని ఆదర్శంగా చూపిస్తూ విద్యా విధానాన్ని సమూలంగా మార్చడం ద్వారా దేశ భవిష్యత్ తరాలకు ప్రమాదకరమైన, తిరోగామి ఆలోచనలకు పునాది వేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితులపై విద్యార్థులు ఐక్యంగా పోరాటాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను అందరికీ అందించే బాధ్యత నుంచి తప్పుకున్నాయని, ఫలితంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస మౌలిక వసతులు లేకుండా పోయాయని అన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది కొరత, ప్రయోగశాల పరికరాలు, గ్రంథాలయాలు, క్రీడా సదుపాయాల లేమి 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశానికి సిగ్గుచేటని విమర్శించారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, మెస్ చార్జీలపై ఆధారపడి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులపై ప్రభుత్వ విధానాలు పుండు మీద కారం చల్లినట్లుగా ఉన్నాయని అన్నారు. విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరాటాల చరిత్ర కలిగిన పిడిఎస్యు విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
జార్జి రెడ్డి, జంపాల, శ్రీపాద శ్రీహరి, కోలా శంకర్, దుస్సా చేరాలు, రమణయ్య, వీరారెడ్డి, వరహాలు, చాంద్ పాషా, మధుసూదన్ రాజ్, వీరన్న, స్నేహలత, రంగవల్లి వంటి అమరవీరులు విద్యారంగ సమస్యల పరిష్కారం, సమాజ మార్పు కోసం తమ ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు.
ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ పిడిఎస్యు ఆధ్వర్యంలో జనవరి 23, 24, 25 తేదీల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలో 23వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభలను విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, టియుసిఐ జిల్లా అధ్యక్షులు గొడ్డలి నర్సయ్య, పిడిఎస్యు జిల్లా నాయకులు మాలోత్ చందర్ రావు, నితిన్, శిరీష, ప్రసాద్, శ్రీనాథ్, దినేష్, కుమార్, రాజు, బాలు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి